నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ సైన్యం జరిపిన తాజా దాడుల్లో గాజాలో ఒక్కరోజులోనే 60 మంది మృతి చెందారు. ఈమేరకు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే ఇజ్రాయిల్ దురాక్రమణ వల్ల ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతోమంది ఆకలితోనే చనిపోతున్నారు. గాజాలో ఆకలితో బలవుతున్నారు. గాజాలో 2.3 మిలియన్ల ప్రజలు ఆకలి విపత్తును ఎదుర్కొంటున్నారని తాజాగా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
కాగా, గాజా స్ట్రిప్కి ఆహారాన్ని అందించే ట్రక్కులు చాలా పరిమితంగానే వస్తున్నాయి. కనీసం ఒక్క ఆహార పొట్లాన్ని అయినా అందించమని పాలస్తీనా ప్రజలు వేడుకుంటున్నారు. దీన్నిబట్టే అక్కడ పాలస్తీనియన్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయిల్ సైన్యం వైద్య సదుపాయాలను కూడా పూర్తిగా నాశనం చేసింది. ఈ దాడుల్లో జనరేటర్లను ధ్వంసం చేయడం వల్ల ఆపరేటింగ్ యూనిట్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యవసర విభాగాలు, నర్సరీలు ఇలా అన్ని విభాగాల్లో వైద్య సేవలు క్లిష్టతరం అయ్యాయి. ప్రజలు అత్యవసర వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.