నవతెలంగాణ-హైదరాబాద్: తూర్పు పసిఫిక్ జలాల్లో మరో నౌకపై అమెరికా సోమవారం దాడి జరిపింది. డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కొనే సాకుతో అమెరికా జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వార్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆదేశానుసారం, సదరన్ కమాండ్కి చెందిన జాయింట్ టాస్క్ ఫోర్స్ అంతర్జాతీయ జలాల్లో నౌకపై దాడులు చేపట్టినట్లు సదరన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నౌక తూర్పు పసిఫిక్లోని డ్రగ్స్ అక్రమ రవాణా చేపడుతోందని ఆరోపించింది. దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది.
ఆగస్ట్ 14 నుండి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ దక్షిణ కరేబియన్లో నేవీని మోహరించిన సంగతి తెలిసిందే. ఈ సైన్యం మోహరింపును పలు దేశాలు ఖండిస్తున్నాయి. మదురో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, వెనిజులాలోని సహజవనరులను కొల్లగొట్టే యత్నంగా పేర్కొన్నాయి. సెప్టెంబర్ 2 నుండి, కరేబియన్ మరియు తూరు పసిఫిక్లో అమెరికా జరిపిన దాడుల్లో 30కి పైగా నౌకలు ధ్వంసం కాగా, సుమారు 107మంది మరణించారు.
2014లో హవానాలో జరిగిన కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ అండ్ కరేబియన్ స్టేట్స్ (సిఇఎల్ఎసి) రెండవ సమ్మిట్లో ప్రకటించినట్లుగా.. లాటిన్ అమెరికా మరియు కరేబియన్లను ‘పీస్జోన్’గా పరిరక్షించాల్సిన అవసరాన్ని పలు దేశాలు,మానవ హక్కుల సంస్థలు స్పష్టం చేశాయి. అమెరికా సైనిక విస్తరణ, శతృత్వం ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టిస్తోందని హెచ్చరించాయి.



