నవతెలంగాణ-హైదరాబాద్: తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నాయనే ఆరోపణలపై అమెరికా సైన్యం రెండు పడవలను బాంబులతో పేల్చేసింది. దీంతో పడవలో ఉన్న ఐదుగురు మృతి చెందారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు అని అమెరికా సైన్యం ఆదివారం వెల్లడించింది. ట్రంప్ ప్రభుత్వం ఒకవైపు అక్రమ మాదక ద్రవ్యాల రవాణా నౌకలపై దాడులు చేస్తూనే.. మరోవైపు ఇరాన్ ఓడరేవులపై నావికా దిగ్బంధనానికి సన్నాహాలు చేస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమెరికా నార్కో టెర్రరిస్టులపై దృష్టి పెట్టింది. అక్రమ మాదక ద్రవ్యాల్ని రవాణా చేసేవారికి లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటివరకు అమెరికా దాడుల్లో 168 మంది మృతి చెందారు. అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను అరికట్డడానికి తూర్పు పసిఫిక్, కరేబియన్ సముద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అయితే తాజాగా పేల్చేసిన పడవల్లో మత్తుపదార్థాలు ఉన్నాయనడానికి అమెరికా సైన్యం వద్ద ఎలాంటి ఆధారాలు లేవు.



