Thursday, June 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్‌ డిజిటల్‌ నిఘా

యూఎస్‌ డిజిటల్‌ నిఘా

- Advertisement -

– అప్రమత్తమవుతున్న విద్యార్థులు
– సోషల్‌ మీడియా ఖాతాలు వడబోత
– గతంలో చేసిన వివాదాస్పద పోస్టులుంటే తొలగింపు
– ట్రంప్‌ యంత్రాంగం మార్గదర్శకాలతో అప్రమత్తం
– అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కొత్త పరీక్ష
– ఆ దేశ విధానాలను ప్రశ్నించే పోస్టులుంటే అంతే సంగతులు
– వీసా దరఖాస్తుదారుల్లో టెన్షన్‌
న్యూయార్క్‌:
అమెరికాలో డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. చిన్న కారణాలనూ భూతద్దంలో పెట్టి చూస్తూ.. విద్యార్థులను యూనివర్సిటీలు, దేశం నుంచి వెళ్లగొట్టిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా, సామాజిక మాధ్యమాల్లో తమకు వ్యతిరేకంగా, ఇతర దేశాలకు అనుకూలంగా విద్యార్థులెవరైనా పోస్టులు చేసినట్టు కనిపిస్తే ఇక అంతే సంగతులు. అలాంటి వివాదాస్పద పోస్టులు చేసిన విద్యార్థులు చాలా మంది బహిష్కరణ వేటుకు గురయ్యారు. అయితే, ఇక్కడ విద్యనభ్యసించటానికి వచ్చే స్టూడెంట్స్‌కు వీసా జారీ కోసం వారి సోషల్‌ మీడియా ఖాతాలు, అందులోని పోస్టులను పరిశీలించాలని అమెరికా తీసుకొచ్చిన విధానం ఇప్పుడు వారిని కలవరపెడుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అమెరికాకు వచ్చి, అక్కడ విధ్యనభ్యసించాలని కోరుకునే విద్యార్థుల్లో ఇప్పుడు ఇదే భయం నెలకొన్నది. ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించిన వారు.. డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలతో అలాంటి చర్యలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు.. గతంలో అప్పుడెప్పుడో సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులను సైతం ఒకవేళ వివాదాస్పదంగా అనిపిస్తే విద్యార్థులు వాటిని తొలగిస్తున్నారు. అమెరికాలో చదువుల కోసం తమ సోషల్‌ మీడియా ఖాతాలను స్వయంగా వడబోస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటి వివాదాస్పద పోస్టులు అమెరికా యంత్రాంగం కంటబడితే.. వీసా నిలిచిపోయే ప్రమాదమున్నదని విద్యార్థులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో ట్రంప్‌ యంత్రాంగం సోషల్‌మీడియాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నైజీరియాకు చెందిన విద్యార్థి ఒవోలాబి (23) ఈ ఏడాది కనెక్టికట్‌లోని న్యూ హెవెన్‌ విశ్వవిద్యాలయంలో సైబర్‌ సెక్యూరిటీలో మాస్టర్స్‌ డిగ్రీకి స్థానం సంపాదించాడు. అయితే, ట్రంప్‌ సర్కారు సోషల్‌ మీడియా మార్గదర్శకాలకు ముందే విద్యార్థి వీసా అపాయింట్‌మెంట్స్‌ను నిలిపివేసింది. దీంతో ఒవోలాబి ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు. ”నన్ను ఇబ్బందుల్లో పడేయకుండా ఫేస్‌బుక్‌ లేదా ఎక్స్‌లలో ఏమి రాయాలో నాకు అర్థం కావటం లేదు. నా ప్రతీ కదలికను ఎవరో గమనిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది” అని ఒవోలాబి చెప్పాడు. ప్రతి ఏడూ సబ్‌-సహారా ఆఫ్రికా నుంచి దాదాపు 50వేల మంది విద్యార్థులు అమెరికాకు చదువుకోవటానికి వస్తారు. భారత్‌, చైనాల నుంచి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. 2024లో దాదాపు 20 వేల మంది నైజీరియన్లు యూఎస్‌ కళాశాలల్లో చదువుకోవటానికి వెళ్లారు. ఇది ఆఫ్రికా నుంచి ఎక్కువ.
మేలో కొత్త వీసా అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ చేయాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో రాయబార కార్యాలయాలను ఆదేశించారు. ట్రంప్‌ పరిపాలన ఈ ప్రక్రియను సమీక్షిస్తుందనీ, విద్యార్థుల సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ల పరిశీలనలను విస్తరిస్తుందని చెప్పారు. దీంతో అప్పటి వరకు అమెరికా కాలేజీల్లో సీట్లు సంపాదించిన అనేక మంది విద్యార్థులు ట్రంప్‌ యంత్రాంగం చర్యతో షాక్‌కు గురయ్యారు. ఈ చర్య విద్యార్థులపై విస్తృత అణచివేత చర్యల్లో భాగంగా విద్యావేత్తలు, మేధావులు అభివర్ణించారు. వీసాలను రద్దు చేయాలనీ, అంతర్జాతీయ విద్యార్థుల బహిష్కరణల సంఖ్యను పెంచాలని అమెరికా ప్రభుత్వం అనుకుంటున్నదని ఆరోపణలు వచ్చాయి. అయితే, విదేశీ విద్యార్థుల విషయంలో తాము తీసుకొచ్చే కొత్త విధానాలు సరిహద్దు బలోపేతం, జాతీయ భద్రత కోసమేనని వైట్‌హౌజ్‌ తన చర్యను సమర్థించుకుంటున్నది.

‘నా వీసా దరఖాస్తు నిలిచిపోయింది’
అమెరికా ప్రభుత్వం తాజా చర్యలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను అభద్రత, అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. ” నా వీసా దరఖాస్తు నిలిపివేయబడిందని నాకు ఒక ఈమెయిల్‌ వచ్చింది. ఆ తర్వాత నేను నా ఎక్స్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలను తొలగించాను” అని బార్బేడియన్‌ విద్యార్థి బ్లాక్‌మెన్‌(20) చెప్పాడు. అయితే, గతంలో ట్రంప్‌ పాలనలో తీవ్ర సంచలనంగా మారిన ‘బ్లాక్‌ లివ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి మద్ధతుగా మద్దతుగా తన బ్లాక్‌ పోస్టులు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయనీ, వాటి గురించి ఆందోళన చెందుతున్నట్టు వివరించాడు. నాలాంటి యువతకు జాత్యహంకార, పోలీసుల క్రూరత్వం గురించి మాట్లాడటానికి ఒక ఇంటర్నెట్‌ ఒక గొంతుకను ఇచ్చిందన్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం నన్ను నిశబ్దంగా చేసినట్టు, పర్యవేక్షించబడుతునట్టుగా భావిస్తున్నానని ఆయన తెలిపాడు.

డిజిటల్‌ నిఘా
చాలా మంది యూఎస్‌ వీసా దరఖాస్తుదారులు 2019 నుంచి తమ ఫేస్‌బుక్‌ లేదా ఎక్స్‌ హ్యాండిల్స్‌ వంటి వారి సోషల్‌ మీడియా ఐడెంటి ఫైయర్లను బహిర్గతం చేయాల్సి నవసరం ఉంటుంది. అయితే, ఈ డిజిటల్‌ నిఘా.. దరఖాస్తుదారుల డేటా గోప్యత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుందని డిజిటల్‌ హక్కుల న్యాయవాదులు అంటున్నారు. కొత్త విధానాల గురించి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ.. దేశంలోకి ప్రవేశించాలనుకునే ఎవరినైనా పరిశీలించటానికి యూఎస్‌ ప్రతీ సాధనాన్నీ ఉపయోగించటానికి సిద్ధంగా ఉన్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్‌ అన్నారు.

అమెరికా తీరు సరికాదు.. భావ ప్రకటనా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం : హక్కుల కార్యకర్తలు
ఇమిగ్రేషన్‌ ప్రక్రియలో భాగంగా వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలు, కార్యకలాపాల పరిశీలనపై ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. ఇది చట్టబద్ధమైన భద్రత సమస్యలు, అనవసరమైన డిజిటల్‌ నిఘా మధ్య ఉండే రేఖను మసకబారుస్తుందని పాన్‌- ఆఫ్రికనల్‌ సామాజిక సంస్థ అయిన పారాడిగ్మ్‌ ఇనిషియేటివ్‌ డిజిటల్‌ హక్కుల న్యాయవాది ఖాదీజా ఎల్‌-ఉస్మాన్‌ అన్నారు. ఆన్‌లైన్‌ కార్య కలాపాల ఆధారంగా దరఖాస్తుదారులను ప్రొఫైలింగ్‌ చేయటం సరికాదన్నారు. విద్యార్థులు చేసిన పోస్టులను తప్పుగా అర్థం చేసుకుంటే వారి వీసాలు నిరాకరణకు గురవుతాయని వాదిం చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఒక విదేశీ ప్రభుత్వం సోషల్‌ మీడియా ఫీడ్‌ను సమీక్షించటం స్వీయ సెన్సార్‌షిప్‌నకు దారి తీస్తుందని ఎల్‌-ఉస్మాన్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -