నవతెలంగాణ-హైదరాబాద్: లండన్ వేదికగా చైనాతో చర్చలు పూర్తి అయినట్టు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య సానుకూలమైన వాతావరణంలో చర్చలు ముగిశాయని, అందుకు చైనా అధ్యక్షుడు జీన్పింగ్ అంగీకరమే తరువాయి అని సోషల్ మీడియా ట్రూత్ వేదికగా బుధవారం ట్రంప్ వెల్లడించారు. చైనా అవసరమైన అరుదైన భూమి ఖనిజాలను సరఫరా చేస్తుంది, చైనా విద్యార్థులు అమెరికన్ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో వారు నిశ్చితంగా విద్యను కొనసాగించడానికి అనుమతిస్తుంది. మేము మొత్తం 55% సుంకాలను పొందుతున్నాము, చైనా 10% పొందుతోందని ట్రంప్ రాసుకొచ్చారు.
ఇటీవల ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. కానీ ఆది నుంచి ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ..ట్రేడ్ వార్లో అమెరికాను ఢీకొట్టింది బీజింగ్ ప్రభుత్వం. ఇరుదేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగిన..అమలుకు నోచుకోలేదు. జెనీవా వేదికగా ఇరుదేశాల నేతలు ప్రతీకార సుంకాలపై చర్చించి..సుంకాలు తగ్గించుకున్నాయి. ప్రతీకార సుంకాలపై 90రోజులు తాత్కాలిక విరామం ప్రకటించుకున్నారు. కానీ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ముగిసిందనే లోపే..అమెరికా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన విద్యార్థుల వీసాలను అర్ధాంతరంగా రద్దు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.అంతేకాకుండా గతవారం రెండు దేశాల అధ్యక్షులు ఫోన్ అంశాలపై చర్చించారు. ఈక్రమంలో మరోమారు లండన్ వేదికగా ..రెండు దేశాల దిగుమతుల సుంకాలపై చర్చించి..అంతిమ నిర్ణయానికి వచ్చాయి.