నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో విదేశీయులపై వేటు వేసేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైంది. అమెరికాలో చెల్లుబాటు అయ్యే సుమారు 5.5కోట్ల మంది వీసాలను బహిష్కరణ నేరాల కోసం పరిశీలిస్తున్నామని ట్రంప్ యంత్రాంగం గురువారం తెలిపింది. వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని దేశం నుండి బహిష్కరించనున్నట్లు పేర్కొంది. పలు దేశాలకు చెందిన పర్యాటకులు సహా యుఎస్ వీసా కలిగిన వారందరూ ‘నిరంతరం పర్యవేక్షణ’కు లోబడి ఉంటారని, వారు అమెరికాలోకి ప్రవేశించడానికి లేదా నివసించేందుకు అనుమతి పొందేందుకు అర్హులనే సంకేతాలను దృష్టిలో ఉంచుకుని ఉంటారని స్టేట్ డిపార్ట్మెంట్ మీడియా ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపింది.
నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం, లేదా ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం వంటి సమాచారం వెల్లడైతే.. ఆ వ్యక్తులపై అనర్హత వేటు వేయనున్నట్లు ఆ విభాగం తెలిపింది. అటువంటి సమాచారం దొరికితే వీసా రద్దు చేయబడుతుందని, వారు అమెరికాలోనే ఉంటే బహిష్కరణకు గురవుతారని పేర్కొంది. వారిపై విస్తృత పర్యవేక్షణ ఉంటుందని, అమెరికాలో ఉండేందుకు అనుమతి పొందిన వారిని సైతం అకస్మాత్తుగా దేశం నుండి బహిష్కరించవచ్చని విదేశాంగ సూచించింది. తమ పరిశీలనలో భాగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నంతటినీ సమీక్షిస్తామని, చట్ట అమలు లేదా ఇమ్మిగ్రేషన్ రికార్డులు లేదా వీసా జారీ అనంతరం వెలుగులోకి వచ్చిన ఇతర సమాచారాన్ని అనర్హత కోసం వినియోగించవచ్చని తెలిపింది.
వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయడం కూడా అమెరికా నిలిపివేస్తుందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో గురువారం తెలిపారు. ఈ మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని అన్నారు. అయితే అమెరికాలో ఎంతమంది విదేశీ ట్రక్ డ్రైవర్లు ఉన్నారన్న ప్రశ్నకు ఆ విభాగం స్పందించలేదు.