నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో షట్డౌన్ ఇంకా కొనసాగుతుంది. దీని నేపథ్యంలో ఇటీవల హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా దాన్ని పునరుద్ధరించారు. అమెరికా కార్మిక శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.
అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్ 30 నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. దీని కారణంగా లేబర్ కండీషన్ అప్లికేషన్, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆగిపోయాయి. తాజాగా తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెస్ను విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం తిరిగి ప్రారంభించిందని కార్మిక శాఖ తెలిపింది. అమెరికన్ కంపెనీలు దరఖాస్తులు ప్రారంభించవచ్చని వెల్లడించింది. గ్రీన్ కార్డుకు సంబంధించి ప్రాసెస్లు ప్రారంభించినట్లు వివరించింది. అమెరికా కార్మికశాఖ తాజా ప్రకటన ప్రభావం భారతీయ పౌరులపైనా పడనుంది. హెచ్-1బీ వీసా పొందేవాళ్లలో దాదాపు 70శాతం మంది భారతీయులు ఉన్నారు. తాజా ప్రకటన వారికి తీపి కబురే.
దరఖాస్తు ప్రాసెసింగ్లు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలను ఓఎఫ్ఎల్సీ తీసుకొంటుందని తెలిపింది. ఈసందర్భంగా ఇప్పటికే ఉన్న అనేక దరఖాస్తుల విషయాన్ని ప్రస్తావించింది. వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనలు పెరిగే అవకాశం ఉందని, దీంతో సాధారణ ప్రాసెసింగ్లకు ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొంది.

                                    

