నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా-ఇరాన్ చర్చలపై ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ సైన్యం కొట్టిపారేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికన్లు వారితో వారే చర్చలు జరుపుకుంటున్నారని ఇరాన్ సైనిక ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఇరాన్ మిలటరీ ప్రధాన కార్యాలయం ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రతినిధి లెప్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జుల్పఘరి రికార్డింగ్ వీడియో ఒకటి బుధవారం ప్రభుత్వ అధికారిక మీడియాలో ప్రసారమైంది.
ఆ వీడియోలో ఆయన అమెరికా చర్చలపై ఘాటుగా స్పందించారు.‘‘మీరు తరచుగా ప్రస్తావించే ‘వ్యూహాత్మక శక్తి’ ..ఇప్పుడు ఒక ‘వ్యూహాత్మక వైఫల్యం’గా మారింది. తానే ప్రపంచ అత్యున్నత శక్తిగా చెప్పుకునే దేశం, సాధ్యమైతే ఈ చిక్కుముడి నుండి ఎప్పుడో బయటపడి ఉండేది. మీ ఓటమిని ఒక ఒప్పందంగా చిత్రీకరించకండి. మీ డొల్ల వాగ్దానాల శకం ముగిసిపోయింది” అని పేర్కొన్నారు. మీ అంతర్గత సంఘర్షణలు, మీతో మీరే బేరసారాలు జరుపుకునే స్థాయికి చేరుకున్నాయా” అని ఎద్దేవా చేశారు. మొదటి రోజు నుండి మా మొదటి, చివరి మాట అదే.. అది అలాగే కొనసాగుతుంది. మాలాంటి వారు మీ లాంటి వారితో ఎప్పటికీ రాజీపడరు.. ఎప్పటికీ” అని జల్ఫఘరి స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్కు 15 షరతుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని పంపిందన్న వార్త వెలువడిన కొద్ది సేపటి తర్వాత ఇరాన్ సైనిక ప్రతినిధి నుండి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.



