నవతెలంగాణ-కమ్మర్పల్లి: ఇసుక అక్రమ రవాణాను వ్యతిరేకిస్తూ వేల్పూర్ గ్రామస్తులు కదంతొక్కారు. రేయింబవళ్లు తేడా లేకుండా గ్రామ పరిధిలోని ఇసుక వనరులను యథేచ్చంగా తవ్వకాలు జరుపుతూ..ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. తమ గ్రామ వనరులైన ఇసుకను ఇతర గ్రామాల వారు తమ గ్రామం నుండి తరలించొద్దని నినాదాలు చేస్తూ నడుకుడ బ్రిడ్జి వద్ద అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను, రవాణాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారీ యోత్తున నిరసన ప్రదర్శన చేపట్టి ర్యాలీగా వెళ్లి తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ కార్యక్రమనికి స్థానిక రైతుల సంఘాలతో పాటు ఇతర కుల సంఘాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని కోరుతూ తహసిల్దార్ అనిరుధ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా వేల్పూర్ పరిధిలో ఇసుకను తమ గ్రామాల నుండి ఇతర గ్రామాలకు అక్రమంగా తీసుకెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను అక్రమంగా తీయడంతో భూగర్భ జలాలు అడుగంటి తీవ్రమైన కరువు దారితీస్తుందని. తద్వారా సాగునీరు, తాగునీరు పశువులకు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులకు, రైతులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయని ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ అనిరుద్ మాట్లాడుతూ గ్రామ ఇసుక వినియోగ విషయమై జిల్లా కలెక్టర్కు తెలియజేస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కోసం వేల్పుర్ గ్రామస్తులు సమయం ఇవ్వాలని, సహకరించాలని తహసిల్దార్ కోరారు.



