నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో చమురు కంపెనీ ‘సిట్గో’ చట్టవిరుద్దమైన అమ్మకాన్ని వెనిజులా తీవ్రంగా ఖండించింది. బిలియన్ డాలర్ల అప్పులను చెల్లించేందుకు వెనిజులా చమురు కంపెనీ సిట్గోను మోసపూరిత బలవంతంగా విక్రయించేందుకు అధికారం ఇస్తూ అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెనిజులా ఉపాధ్యక్షుడు, పెట్రోలియం మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ ఖండించారు. న్యాయప్రక్రియలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రోడ్రిగ్జ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిట్గో మాతృసంస్థను హెడ్జ్ ఫండ్ ఎలియట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అనుబంద సంస్థ అయిన అంబర్ ఎనర్జీకి 5.9 బిలియన్ డాలర్లకు విక్రయించాలని డెలావేర్ జడ్జి లియోనార్డ్ స్టార్క్ గతవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ”కోర్టు ఆదేశాలకు వ్యూహాత్మక యుఎస్ ఇంధన పెట్టుబడిదారుల బృందం మద్దతు ఇచ్చింది” అని ఎలియట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
వెనిజులాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీ పిడివిఎస్ఎ(పెట్రోలియోస్ డి వెనిజులా, ఎస్ఎ) కి చెందిన అనుబంధ సంస్థ సిట్గో రుణదాతలకు 20బిలియన్ డాలర్లకు పైగా బాకీ ఉందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. గతంలో లాభదాయకంగా ఉన్న ఈ సంస్థ అమెరికా ఆంక్షల కారణంగా విస్తృత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ కంపెనీ రుణదాతల్లో కెనడియన్ సంస్థ క్రిస్టలెక్స్ కూడా ఉంది. 2008లో వెనిజులా లా క్రిస్టినాస్ గనిని స్వాధీనం చేసుకుని జాతీయం చేయడంతో.. ఆ ప్రభుత్వం క్రిస్టలెక్స్కు 1.2బిలియన్ డాలర్ల బాకీ ఉందని మరో యుఎస్ కోర్టు పేర్కొంది.
కరేబియన్ సముద్రంలో ఇటీవల అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడంపై, వెనిజులా చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతరం సిట్గో విక్రయం తెరపైకి వచ్చింది.



