Friday, June 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివేతనాల అసమానతలు-ముక్కలౌతున్న కార్మికవర్గం

వేతనాల అసమానతలు-ముక్కలౌతున్న కార్మికవర్గం

- Advertisement -

కరోనా మహమ్మారి ప్రభావంతో కార్మికుల వేతనాలు దిగజారడం గాని, ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోవడం గాని జరిగింది. ఆ పరిస్థితిలో తాజాగా కొంత మార్పు వచ్చిందని, ప్రపంచ మార్కెట్‌లో కార్మికుల నిజ వేతనాలలో కొంత పెరుగుదల చోటు చేసుకుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) తాజా నివేదిక వెల్లడిం చింది. అయితే గత రెండేళ్ల కాలంలో కార్మికుల వేతనాలలో కొంత పెరుగుదల కనిపించినా, వారి వేతనాల్లో అస మానతలు మాత్రం పెరుగుతూనే వున్నాయి. పెట్టుబడి ప్రపంచీకరణ ఫలితంగా ప్రపంచంలో ఎక్కడికి కావాలను కుంటే అక్కడికి సంచరించగలిగిన శక్తితో పెట్టుబడి ఉంది. కాని అదే విధమైన స్వేచ్ఛ కార్మికవర్గానికి లేదు. అందు వలన ఎక్కడ చౌకగా కార్మికుల శక్తి దొరుకుతుందో అక్కడికి పోయి ఆ చౌకకార్మిక శక్తిని కొల్లగొట్టేందుకు పెట్టుబడి పూనుకుంటోంది. సరుకుల ఉత్పత్తిని ఒక దగ్గర కేంద్రీకరించకుండా దాన్ని ముక్కలు చేసి ఏ ఉత్పత్తి క్రమంలోనైతే కార్మికుల పాత్ర ఎక్కువగా అవసరమో ఆ భాగాన్ని మాత్రం చౌకగా కార్మికులు లభించే ప్రాంతానికి తరలించడం ప్రపంచీకరణలో అంతర్భాగం.
స్వేచ్ఛా మార్కెట్‌ నేడు ఉనికిలో ఉందని అనుకోవడం కన్నా పెద్ద భ్రమ మరొకటి లేదు. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో నేడు ప్రపంచస్థాయి బహుళజాతి కార్పొరేట్లు తమ ఉత్పత్తి నెట్‌వర్క్‌లను అత్యంత కేంద్రీ కృత పర్యవేక్షణలో నిర్వహిస్తున్నాయి. తాము ఉత్పత్తి చేసే సరుకులకు అవసరమైన ముడి సరుకులను, విడి భాగా లను సరఫరా చేసే ఆ యా సప్లయర్ల మధ్య పోటీ నెలకొనేలా చేస్తున్నాయి. ఎవరైతే అతి తక్కువ ధరలకు సప్లై చేయగలుగుతారో వారే ఆ సరఫరా కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. దాని ఫలితంగా వారు తమ వద్ద పని చేసే కార్మికుల శ్రమను అతి తక్కువ స్థాయిలో తొక్కిపట్టి ఉంచడానికి పూనుకుంటున్నారు. అలా చేసినప్పుడు కార్మి కుల నుండి ప్రతిఘటన రాకుండా ఉండడానికి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. లేబర్‌ మార్కెట్‌లో అతి తక్కువ వేతనాలు లభించే చోట్ల మహిళా కార్మికుల శాతం పెరుగుతోంది. వేతనం చెల్లించే పద్ధతి కూడా అమలు కాకుండా గుండుగుత్తగా (ఇంత పనిచేయడానికి ఇంత సొమ్ము చెల్లిస్తాం, ఎంతమంది పని చేశారు, ఎంత కాలం పని చేశారు అన్నదానితో మాకు నిమిత్తం లేదని యజమానులు చేసుకునే ఒప్పందాలు) పనులకు నియమించడం పెరుగుతోంది.
ఈ పద్ధతుల వలన ఒక వైపు కార్మికుల వేతనాలలో అసమానతలు పెరుగుతున్నాయి. మరొక వైపు ఆ కార్మికులు పలువిధాలుగా ముక్కలౌతున్నారు. కాని పెట్టుబడి కేంద్రీకరణ మాత్రం పెరుగుతోంది. సంపద పోగు బడడమూ పెరుగుతోంది. ముక్కచెక్కలౌతున్న కార్మికవర్గంలో ఒక ముక్కను మరొక ముక్కకు వ్యతిరేకంగా పోటీ పెట్టి, అధికార, అనధికార నియంత్రణా పద్ధతులను ఉపయోగించి పెట్టుబడిదారులు మాత్రం తమ లాభాలను పెంచు కోగలుగు తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వేతనాల తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయన్నది తాజాగా ఐఎల్‌వో విడుదల చేసిన ప్రపంచ వేతన నివేదిక (గ్లోబల్‌ వేజ్‌ రిపోర్ట్‌) వెల్లడించింది. ద్రవ్యోల్బణం కారణంగా 2023 వరకూ నిజ వేతనాలు బాగా పడిపోయాయి. కాని 2023 తర్వాత ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో కొంతవరకూ కోలుకున్నాయి. ఐతే ఈ పరిస్థితి ప్రపంచం అంతా ఒకే విధంగా లేదు. ఐఎల్‌వో అధ్యయనం చేసిన 160 దేశాలకు గాను 96 దేశాల్లో ద్రవ్యోల్బణం వలన నిజవేతనాలకు కలిగిన నష్టాన్ని పూర్తిమేరకు భర్తీ చేయలేదు. దాని వలన పెరిగిన సంపదలో కార్మికుల వాటా తగ్గుతూనే వుంది. జీడీపీ పెరుగుదలను బట్టి చూసినా అందులో కార్మికులకు దక్కిన వాటా తగ్గు తూనే వుంది. సంపన్న దేశాలవరకే చూసినా, గత 25 సంవత్సరాలలో అక్కడ కార్మికుల ఉత్పాదకత 29 శాతం పెరిగితే, వారి నిజవేతనాలు మాత్రం 15శాతమే పెరిగాయి. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన అనంతర కాలంలో యజమానుల లాభాల వాటా, కార్మికుల వేతనాల వాటా మారకుండా కొన్ని దశాబ్దాలపాటు స్థిరంగా కొనసాగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కార్మికుల వాటా పడిపోతూనేవుంది.
గత రెండేళ్ల కాలంలో మొత్తం మీద చూసినప్పుడు కార్మికుల నిజవేతనాలలో పెరుగుదల కనిపించినా, ఆ వేతనాల అసమానతలు మాత్రం పెరుగుతున్నాయి. వేతనాల స్థాయిని బట్టి ప్రపంచ దేశాలను కనిష్ట, మధ్య తరహా, గరిష్ట స్థాయి దేశాలుగా వర్గీకరించి పరిశీలించితే, గరిష్ట స్థాయి వేతనాలు ఉన్న దేశాలలో వేతనాల్లో అసమానతలు తక్కువగా ఉన్నాయి. కనిష్ట, మధ్య తరహా దేశాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం అసంఘటిత రంగం ఆ దేశాల్లో ఎక్కువగా పెరగడమే. కనిష్ట స్థాయి వేతనాలు ఉన్న దేశాలలో అసంఘటిత కార్మికులు 90 శాతం వరకూ ఉన్నారు. మధ్య తరహా దేశాల్లో 49 నుండి 75 శాతం దాకా ఉన్నారు.
వేతనాలను నిర్ణయించడం అనేది ప్రస్తుత నయా ఉదారవాదయుగంలో రానురానూ ఒక రాజకీయ ప్రక్రియగా మారిపోతోంది. అసంఘటిత కార్మికుల ప్రయోజనాలను కాపాడే రాజకీయ ప్రతినిధులు ఎవరూ లేకపో వడంతో వారు నోరులేని జీవులుగా మిగిలిపోతున్నారు. దాంతో తీవ్ర స్థాయి దోపిడీకి గురౌతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కాని, చట్టపరంగా గాని వారికి ఎటువంటి రక్షణా లభించడం లేదు. ఇటువంటి పరిస్థితి గరిష్ట స్థాయి వేత నాలు అమలౌతున్న దేశాల్లో లేదు. అందుచేత ఆ దేశాల్లో వేతనాల్లో అసమానతలు తక్కువ మోతాదులో ఉన్నాయి. మూడవ ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఉన్న అసంఘటిత కార్మికులను దోపిడీ చేస్తూ వారి శ్రమను కొల్లగొట్టి పోగేసు కున్న సంపదను సంపన్న దేశాలు తరలించుకు పోతున్నాయి.
ఐఎల్‌వో నివేదిక ప్రపంచవ్యాప్తంగా అమలౌతున్న వేతనాల స్థాయిని పరిశీలించింది. డాలర్‌ కొనుగోలుశక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఒకే స్థాయిలో ఉంటుందన్న ప్రాతిపదికన (డాలర్‌ పర్చేసింగ్‌ పవర్‌ పారిటీ, పిపిపి) వేత నాలను సరిపోల్చింది. అలా చూసినప్పుడు కనిష్ట స్థాయి వేతనాలున్న అత్యధిక మూడవ ప్రపంచ దేశాలలో వేతనాలు 201డాలర్లు ఉన్నాయి. అదే మధ్య తరహా దేశాల్లోనైతే 630 డాలర్లు ఉన్నాయి. ఇక గరిష్ట స్థాయి దేశాల్లోనైతే వేతనాలు 3333 డాలర్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కనిష్ట స్థాయి దేశాల్లో కార్మికుడి కొనుగోలు శక్తి మధ్యతరహా దేశాల కార్మికుడితో పోల్చితే మూడో వంతు మాత్రమే ఉంది. కొత్త టెక్నాలజీని రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టనున్నారు. దీని వలన ఉత్పత్తిలో మానవ శక్తిని వినియోగించవలసిన అవసరం మరింత తగ్గుతుంది. అదే సమయంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ ప్రత్యేక నైపుణ్యాన్ని పొందాలంటే అందుకు కావలసిన విద్యను, నిపుణతను పొంద గలగాలి. విద్య ప్రయివేటుపరం అయిన అనంతరం ఆర్థిక స్తోమత ఉన్న కొద్దిమంది మాత్రమే ఈ ఆధునిక విద్యను, సాంకేతికను దొరకబుచ్చుకోగలుగుతారు. తక్కినవారు, అత్యధిక మెజార్టీగా ఉన్నవారు ఈ కొత్త సాంకేతికతకు దూరంగానే మిగిలిపోతారు. వారంతా వేతనాల విషయంలో కనిష్ట స్థాయికి దిగజారిపోతారు.
ఆధునిక సాంకేతికతను, రోబోలను ఎంతగా వినియోగించినప్పటికీ, సూపర్వైజరీ పనులు, సంరక్షణకు సంబంధించిన పనులు (శివు సంరక్షణ, వైద్య సంరక్షణ వగైరా) ఇంటి పనులు వంటివి చేయడానికి మానవ వనరులే అవసరం. అందుకే ఈ రంగాల పనులను అతి తక్కువ వేతనాలతో చేయించుకోడానికి వీలుగా ఈ రంగాల్లో మహిళా కార్మికులను అత్యధికంగా నియోగిస్తున్నారు. కొత్త సాంకేతికత ప్రవేశపెట్టిన ఫలితంగా కొద్దిమంది వేతనాల స్థాయిలో గరిష్టానికి చేరుకున్నా, అత్యధికులు, ముఖ్యంగా మహిళలు కనిష్ట స్థాయికి పడిపోతారు. వేతన అసమానతలతో జెండర్‌ అసమానతలు కలిసి పెరిగిపోతాయి.
మొత్తం మీద చూసినప్పుడు నిజవేతనాలు పెరిగినట్టు ఐఎల్‌వో నివేదిక చెప్పినప్పటికీ, వేతనాల్లో అస మానతలు వేగంగా పెరగడం అనేది వాస్తవం అన్నది వెల్లడైంది. పెట్టుబడి ఎంత ఎక్కువగా, ఒకే దగ్గర ఎంత వేగంగా పోగుబడుతూ వుంటుందో, అంతే వేగంగా వేతనాల అసమానతలు పెరుగుతూ పోతాయి. దానితోబాటు కార్మికులను ముక్కచెక్కలుగా విడగొట్టడమూ పెరుగతూ పోతుంది. కార్మికశక్తి మీద, ఉత్పత్తి క్రమం మీద పెట్టుబడి రాజకీయంగా పైచేయి సాధించడం వల్లనే ఇది సాధ్యపడుతోంది. ఈ పెట్టుబడి ఆధిక్యతను ప్రతిఘటించి, పెరుగు తున్న అసమానతల నుండి బయట పడాలంటే ముక్కముక్కలుగా ఉన్న కార్మికవర్గంలో సమిష్టి వర్గ చైతన్యాన్ని పెంపొందించే రాజకీయ ప్రక్రియను వేగవంతం చేయడమే పరిష్కారం.
(స్వేచ్ఛానుసరణ)
సంజయ్‌ రాయ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -