నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయబోతుందని ఇప్పటికే అమెరికా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్, ఇరాక్లో ఉన్న తమ వారంతా ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమని.. తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. దీంతో ఇరాన్లో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెళ్లాయి. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పక్కా ప్రణాళిక రచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని ప్రపంచ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ పూర్తిగా సన్నద్ధమైపోయినట్లుగా అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇరాన్ అప్రమత్తం అయింది. ఒకవేళ ఏదైనా జరిగితే అందుకు అమెరికా బాధ్యత వహించాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. విదేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇరాన్కు చెందిన ఎక్స్ ట్విట్టర్లో ‘‘మేము కూడా సిద్ధంగా ఉన్నాం.’’ అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ.. ప్రస్తుతం పశ్చిమాసియా అత్యంత ప్రమాదకరమని.. దౌత్య సిబ్బంది.. సైనిక కుటుంబాలు తక్షణమే వెనక్కి వచ్చేయాలని ట్రంప్ సూచించారు.