నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న సంఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పింది. తీవ్ర పరిణామాలతో కూడిన యుద్ధానికి దారితీసే అంచున ఉంచి’ అని ఆయన హెచ్చరించారు.
కాగా, ఈ యుద్ధంపై ఆయన ‘మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన కొన్ని గంటలకే, ఈ పోరాటం ఎవరూ నియంత్రించలేరని గొలుసుకట్టు పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని నేను హెచ్చరించాను. నేను అంచనా వేసినట్టే.. ఇప్పటికీ మూడు వారాలు గడిచినా యుద్ధం ఆగలేదు. అదుపు తప్పింది. ఈ సంఘర్షణ ఇంత తీవ్రరూపం దాలుస్తుందని నాయకులు సైతం ఊహించలేదు. ఈ అపారమైన హింస కేవలం మానవుల్ని బాధించడమే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం కుదిపేస్తోంది’ అని ఆయన అన్నారు. ఈ సమయంలో దౌత్యపరమైన జోక్యం యొక్క ఆవశ్యకతను ఆయన పునరుద్ఘాటించారు. హింసను పెంచడం ఆపాలని సంబంధిత పక్షాలన్నింటినీ ఆయన కోరారు. ఈ యుద్ధం వల్ల మానవుల బాధలు తీవ్రతరమయ్యాయి. పౌర మరణాలు పెరుగుతున్నప్పుడు, ప్రపంచ ఆర్థిక ప్రభావం అంతకంతకూ వినాశకరంగా మారుతున్నప్పుడు ఈ యుద్ధాన్ని ముగించడానికి ఇదే సరైన సమయం అని ఆయన నొక్కి చెప్పారు.



