నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం సృష్టించి.. తద్వారా లబ్ధి పొందాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. నీటి వాటాలపై చర్చ దృష్ట్యా ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఎన్నికల్లో వరుస ఓటములతో బీఆర్ఎస్ మనుగడ కష్టమవుతోందని కేసీఆర్ గుర్తించారు. మళ్లీ జలవివాదం రేపి, ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల సృష్టించి తన పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటుచేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బతికించుకునేందుకు మళ్లీ నీళ్ల సెంటి మెంట్ను వాడుకుంటున్నారు. చంద్రబాబు పేరు చెప్పి తెలంగాణలో మళ్లీ పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీఎం విమర్శించారు.



