విజయవాడ: కృష్ణా తూర్పు డెల్టా కాల్వలకు ఆదివారం నీరు విడుదల చేశారు. ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ డా లక్ష్మీశ కలిసి బటన్ నొక్కి నీటిని విడుదల చేశారు. రైవస్ కాలువకు 700, బందరు కాలువకు 300 మొత్తంగా వెయ్యి క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేశారు. అనంతరం బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాను కాపాడుకుంటూ సరైన సమయంలో, సకాలంలో నీటిని విడుదల చేయడం నిరంతరం జరుగుతుందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడంతో పాటు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ, అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వల్లూరి పల్లి గణేశ్, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.