– రైతుల ఆత్మహత్యలను నివారించాలి
– బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
్గనవతెలంగాణ-ముషీరాబాద్
కేంద్రం.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాన్ని పంపిణీ చేసి, రైతుల ఆత్మహత్యలను నివారించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీపీిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ సోషల్ ఫౌండేషన్ (టీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ”తెలంగాణ జల వనరులు, వ్యవసాయం, నాడు-నేడు-రేపు” అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్వెస్లీతోపాటు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. నదీ జలాల పంపిణీ వాటాలో న్యాయమైన వాటా సాధించుకునే అంశంలో గట్టిగా నిలబడి పోరాడి సాధించుకోవాలని, దానికి సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణలో 1,75,000 ఎకరాలకు సాగుకు నీటి వనరులు ఉపయోగించుకోవాలని, దానివల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నీటి వనరుల విషయంలో ఇరు రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, అందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక ప్రణాళిక రచించి అఖిలపక్షంలో ప్రత్యేకంగా చర్చించాలని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పొత్తులో ఉన్నందున తెలంగాణకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి అపెక్స్ కౌన్సిల్లో ఈ నదీ జలాలపై చర్చ జరిపితేనే మన వాటా మనకు దక్కే అవకాశం ఉందని స్పష్టంచేశారు. బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలకు నిధులు కేటాయిస్తున్నదని, ప్రతిపక్ష ప్రభుత్వాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హౌదా కల్పించలేదని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హౌదా కల్పించకుండా పోలవరానికి జాతీయ హౌదా కల్పించి తెలంగాణను ఆర్థికంగా అణగదొక్కిందన్నారు. జాతీయ ప్రాజెక్టుల్లో నదీ జలాల్లో మన వాటా మనం దక్కించుకునే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాన్ని పంపిణీ చేయాలన్నారు. తెలంగాణకు జీవన జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయాలని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ రావు దేశ్పాండే, ప్రముఖ పాత్రికేయులు పరంకుశం వేణుగోపాల్ స్వామి, విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి తన్నీరు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాలకు నీటి వాటాల్ని పంపిణీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES