నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాకు వస్తున్న వందల బిలియన్ డాలర్ల ప్రతీకార సుంకాలతో రుణాలు చెల్లించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భాగస్వామ్య దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను ఆయన సమర్థించారు. చాలా ఏళ్ల క్రితమే సుంకాలను విధించి ఉండాల్సిందని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ” మేము రుణాలను చెల్లించాలని నిర్ణయించాం. మాకు చాలా నగదు వస్తోంది. దేశం ఇప్పటివరకు చూడని దాని కంటే చాలా అధిక మొత్తం వస్తోంది. ఈ నగదుతో దేశంపై రుణభారాన్ని తగ్గించనున్నాం. చాలా ఏళ్ల క్రితమే సుంకాలను విధించి ఉండాల్సింది. నా మొదటి పదవీకాలంలో చైనాపై విధించాను. కొవిడ్ మహమ్మారి దెబ్బతో మిగిలిన వాటికి చేరుకోలేకపోయాము” అని అన్నారు. వీలైతే మరిన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించాలనుకుంటున్నామని అన్నారు.
ఏప్రిల్ 2న ట్రంప్ వాణిజ్యలోటు ఉన్న దేశాల నుండి దిగుమతులపై 50శాతం వరకు ప్రతీకార సుంకం, అన్ని ఇతర దేశాలపై పది శాతం సాధారణ సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాణిజ్యలోటును అత్యవసర పరిస్థితిగా ప్రకటించేందుకు ట్రంప్ 1977 చట్టాన్ని వినియోగించారు. ఈ చట్టం దిగుమతి సుంకాలను సమర్థిస్తుంది.