– ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరు
– కాల్పుల విరమణకు పాక్ పరిగెత్తుకొచ్చింది
– ముష్కర మూకల శిబిరాలు తుడిచిపెట్టాల్సిందే
– న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ను సహించం
– భారత సైన్యానికి సెల్యూట్
– ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
ఢిల్లీ: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు ఆయన సెల్యూట్ చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం తొలిసారి జాతినుద్దేశించి మోడీ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుద ముట్టిస్తామని స్పష్టం చేశారు. ‘న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్’కు పాల్పడితే సహించేది లేదని పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్ నిర్ణయాలకనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ప్రకటించారు.
పాక్ రక్షణ వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం..
”రెండున్నర దశాబ్దాలుగా పాక్లో విచ్చలవిడిగా తిరుగుతున్న ఉగ్రవాద తండాలను ఒక్క దెబ్బతో భారత్ తుడిచిపెట్టింది. మనదేశానికి వ్యతిరేకంగా పాక్ నుంచి కుట్రలు పన్నుతున్న వారిని తుదముట్టించింది. మన దెబ్బకు పాక్ నిరాశానిస్పృహల్లో కూరుకుపోయింది. అచేతనావస్థకు చేరుకుంది. దాడులతో ఏటూ పాలుపోని పాక్.. సరిహద్దులోని జనావాసాలు, పాఠశాలలపై దాడికి దిగింది. పాక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను మన క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. పాక్ రక్షణ వ్యవస్థలను భారత క్షిపణులు ఛిన్నాభిన్నం చేశాయి. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో మన మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి.”అని ఆయన వివరించారు.
భారత్ నిర్ణయాలకనుగుణంగానే చర్చలు
”ఎలాంటి దుస్సాహసానికి పాక్ తెగబడినా భారత దళాలు చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ నిర్ణయాల మేరకే చర్చలుంటాయి. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయి. పాకిస్తాన్ అణు బ్లాక్మెయిలింగ్ ఇక సహించేది లేదు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుదముట్టించి తీరుతుంది. భారత రక్షణ దళాల సామర్థ్యం ఏంటో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ చవిచూసింది. సాంకేతిక యుద్ధంలో భారత్ పరిణతి, ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. మేడిన్ ఇండియా రక్షణ వ్యవస్థలు ఎంత బలమైనవో.. ఎంత శక్తిమంతమైనవో చాటింది” అని మోడీ చెప్పారు.
బెంబేలెత్తిన పాక్.. చర్చలకు పరుగులు
”పౌరులు, పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలిచాయి. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసే వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ‘ఆపరేషన్ సిందూర్’. అని అభివర్ణించారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యం తో దాడులు నిర్వహించాయి. బహావల్పుర్, మురుద్కే లాంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేసి భీతావహ పరిస్థితిని సృష్టించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదు లు, ఉగ్రవాద సానుభూతిపరులకు భారత్ ఏం చేస్తుందో చెప్పింది. పాక్ గర్వంగా చెప్పుకొనే మిసైళ్లను ధ్వంసం చేశాం. పాకిస్తాన్ విమా నాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని తీసు కొచ్చాం. ఈ చర్యలకు బెంబే లెత్తిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. పాక్ డీజీఎంవో కాల్పుల విరమణ చర్చలకు పరిగెత్తుకుంటూ వచ్చారు” అని ప్రధాని అన్నారు.
పాక్ బతికి బట్టకట్టాలనుకుంటే..
”ఈ యుగం యుద్ధాలది కాదు.. ఉగ్రవాదానిది అంతకన్నా కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు, దాడులకూ భారత్ వెనుకాడదు. ఉగ్రవాదానికి అన్నపానీయాలు అందించే ఎవరినీ ఉపేక్షించదు. పాక్ బతకాలంటే ఉగ్రవాద శిబిరాలను తనంతట తానుగా తుడిచిపెట్టాలి. టెర్రరిజం, చర్చలు రెండూ ఏకకాలంలో ఉండవు. ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ ఏకకాలంలో ఉండవు. ఉగ్రవాదం, నీటి పంపిణీ రెండూ ఏకకాలంలో ఉండవు” అని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రధాని మోడీ గట్టిగా హెచ్చరికలు పంపారు.
సైన్యం సాహసం, పరాక్రమానికి సెల్యూట్
”గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని, సంయమనాన్ని చూస్తున్నాం. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. సైన్యం సాహసం, పరాక్రమానికి నా సెల్యూట్. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికం. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెర పోయింది. ఉగ్రదాడులపై ప్రతి హృదయమూ జ్వలించింది” అని మోడీ అన్నారు.
గగనతలంలోనూ మాదే పై చేయి
వీడియో షేర్ చేసిన ఆర్మీ
‘ఆపరేషన్ సిందూర్’ తో గగనతలంలో శత్రువును దెబ్బకొట్టామంటూ భారతసైన్యం ఒక వీడియోను షేర్ చేసింది. పాకిస్తాన్కు చెందిన మిరాజ్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్టు అందులో పేర్కొంది. మిరాజ్ శకలాలు వీడియోలో కనిపించాయి. పాక్ డ్రోన్ దాడుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతీకార చర్యలను వెల్లడించింది. పాక్ స్థావరాలు, ఎయిర్క్రాఫ్ట్లను ధ్వంసం చేసిన తీరును ఆర్మీ వివరించింది. ఆపరేషన్ సిందూర్పై త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, దాయాది ఆటలు సాగనివ్వలేదని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్సైన్యం జోక్యం చేసుకుంటే తిప్పికొట్టామని వెల్లడించారు.
కాల్పుల విరమణకు ఓకే
– భారత్-పాక్ డీజీఎంవోల మధ్య ముగిసిన చర్చలు
– హాట్లైన్లో సుమారు గంట పాటు సంప్రదింపులు
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అనంతరం ముందుగానే నిర్దేశించిన విధంగా ఈ రెండు దేశాలకు చెందిన డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోలు) మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. సోమవారం సాయంత్రం హాట్లైన్ కమ్యూనికేషన్ ద్వారా దీనిని నిర్వహించారు. భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘరు, పాకిస్తాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరీలు పాల్గొన్నారు. దీంతో తొలిదశ సంప్రదింపులు ముగిశాయి. సుమారు గంట పాటు చర్చలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే ఈ చర్చలు జరగాల్సి ఉన్నా.. అది సాయంత్రానికి వాయిదా పడింది.ఈ చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాలు, విధి విధానాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపు, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) వంటి కీలక అంశాలపై దృష్టిసారించినట్టు తెలిసింది. అయితే, ఇరు దేశాల డీజీఎంవోల మధ్య జరిగిన ఈ చర్చల్లో మాట్లాడిన ప్రత్యేక అంశాలు, ఏమైనా మేజర్ నిర్ణయాలు తీసుకున్నారా అనే దానిపై ఎలాంటి సమాచారమూ బహిర్గతం కాలేదు. ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు వెంట శాంతిని నెలకొల్పే విషయంలో డీజీఎంవోల స్థాయి చర్చలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి.
దెబ్బతీశాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES