నవతెలంగాణ-హైదరాబాద్: వీర్ సావర్కర్కు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారని, ఆయన తన పిటిషన్ను చదివేలా ఆదేశించాలని ఓ వ్యక్తి బాంబే హైకోర్టు ను కోరాడు. మీ పిటిషన్ను చదవాలని ఆయనను ఎలా బలవంతం చేస్తామని న్యాయస్థానం అతడిని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఒకవేళ ఆయన ప్రధాని అయితే విధ్వంసం సృష్టిస్తారని పేర్కొన్నారు. ‘ఆయన ప్రధాని అవుతారని మాకు తెలియదు. మీకు తెలుసా?’ అని హైకోర్టు పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తంచేసింది.
అయితే, రాహుల్పై పరువునష్టం కేసు పెట్టేందుకు పిటిషనర్కు న్యాయపరమైన అవకాశం ఉందని పేర్కొంది. ఈ అంశంపై సావర్కర్ మనవడు పుణె కోర్టును ఆశ్రయించారని, అక్కడ దీనిపై విచారణ జరుగుతుందని ఈసందర్భంగా న్యాయస్థానం గుర్తుచేసింది. ఇక, దీనిపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగిందని, అక్కడ ఆ పిటిషన్ను కొట్టివేసారని వెల్లడించింది. మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. వీర్ సావర్కర్ బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో సావర్కర్ మనవడు పుణె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతుంది.