నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్లో పెద్ద సంఖ్యలో నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్కి చెందిన వారిని గుర్తించామని ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం ప్రకటించింది. సెప్టెంబర్ 30న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేశారని తెలిపింది. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వేలో బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఎ) పెద్ద సంఖ్యలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశీయులను గుర్తించారని ఈసీఐ వర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 1 తర్వాత విచారణ చేపడతామని, అయితే సెప్టెంబర్ 30న ప్రచురించే తుది జాబితాలో వారి పేర్లను చేర్చబోమని పేర్కొన్నాయి.
శనివారం సాయంత్రం 6.00 గంటల సమయానికి 100శాతం ముద్రణ పూర్తయిందని, వారి చిరునామాల వద్ద గుర్తించిన ఓటర్లకు ఇఎఫ్ల పంపిణీ కూడా పూర్తయిందని తెలిపాయి. శనివారంతో గుర్తింపు 6,32,59,497 లేదా 80.11శాతం దాటిందని, అంటే బీహార్లోని ప్రతి ఐదుగురు ఓటర్లలో నలుగురికి ఇఎఫ్లు అందించామని పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 38 జిల్లా ఎన్నికల అధికారులు (డిఇఒలు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఇఆర్ఒలు), 963మంది అసిస్టెంట్ ఇఆర్ఒలు (ఎఇఆర్ఒలు) సహా క్షేత్రస్థాయి బృందాలను సిఇఒ పర్యవేక్షిస్తున్నారని ఇసిఐ పేర్కొంది. బీహార్లో ప్రస్తుతం చేపడుతున్న ఎస్ఐఆర్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.
బీహార్లో జూన్ 25న ఎస్ఐఆర్ ప్రారంభమైంది. బూత్ లెవల్ అధికారులు ఓటర్లకు ఇచ్చిన గణన ఫారమ్లను సమర్పించేందుకు తుదిగడువు జులై 25తో ముగియనుంది. ఆగస్ట్1న ముసాయిదా జాబితా విడుదల కానుంది. ఆధార్, ఇపిఐసి లేదా రేషనస్ కార్డులు కాకుండా రుజువులుగా 11 పత్రాలను సమర్పించాల్సిందిగా ఇసిఐ ఆదేశించింది. అయితే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత కూడా క్లెయిమ్ వ్యవధిలో డాక్యుమెంట్లను సమర్పించవచ్చని తెలిపింది. బీహార్ ఎస్ఐఆర్ని సవాలు చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఆధార్, ఇపిఐసి కార్డులు, రేషన్ కార్డులను కూడా రుజువులుగా పరిగణించాలని జులై 10న ఇచ్చిన తీర్పులో ఇసిఐని ఆదేశించింది. జులై 28కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది.