– మేజర్ జైపాల్సింగ్ భవన్ శంకుస్థాపనలో సీపీఐ(ఎం) అగ్రనేత బృందాకరత్, ఎంఏ బేబీ
– సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర శాఖ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ కార్యాలయాల సముదాయాలు
– నాలుగు అంతస్తుల్లో నిర్మాణం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రముఖ సీపీఐ(ఎం) నేత మేజర్ జైపాల్సింగ్ పేరిట నిర్మించనున్న భవనానికి ఆదివారం నాడిక్కడ సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కరత్ శంకుస్థాపన చేశారు. సీనియర్ నాయకురాలు బిమన్ బసు జెండా ఆవిష్కరించారు. శంకుస్థాపన అనంతరం బృందా కరత్ మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటం తరువాత మేజర్ జైపాల్ సింగ్ పేరుతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని తెలిపారు. ఢిల్లీకి చెందిన ప్రముఖ నాయకుడి పేరిట తలపెట్టిన భవన నిర్మాణ కార్యక్రమం వాస్తవరూపం దాల్చడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ భవనం ప్రజా పోరాటానికి కేంద్రంగా ఉంటుందని వెల్లడించారు. సీపీఐ(ఎం) ఢిల్లీ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా మేజర్ జైపాల్ సింగ్ పని చేశారని, ఢిల్లీ, పశ్చిమ యూపీ, హర్యానాల్లో పార్టీ నిర్మాణంలో ఆయన కీలకభూమిక పోషించారని తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడని గుర్తుచేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మాట్లాడుతూ ఈ కార్యాలయం పార్టీ నిర్మాణానికి, విస్తరణకు కేంద్రం కావాలని, ప్రజా ఉద్యమానికి వేదిక కావాలని ఆకాంక్షించారు. నాలుగంతస్తుల భవనంలో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ, అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) కార్యాలయాలుంటాయని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ప్రకాశ్ కరత్, హన్నన్ మొల్లా, సుభాషిణి అలీ, పుష్పేందర్ సింగ్ గ్రేవాల్, పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ. విజయరాఘవన్, అశోక్ ధావలే, ఎంవీ గోవిందన్, శ్రీదీప్ భట్టాచార్య, అమ్రారామ్, ఆర్. అరుణ్కుమార్, విజ్జూ కృష్ణన్, మరియం ధావలే, కేంద్ర కమిటీ సభ్యులు మహ్మద్ యూసఫ్ తరిగామి, కె.రాధాకృష్ణన్, ఏఆర్ సింధు, విక్రమ్ సింగ్, పూతలత్ దినేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ కార్యదర్శి ఎం.సాయిబాబు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ వి. శివదాసన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపోరాటాలకు వేదిక కావాలి
- Advertisement -
- Advertisement -