– 2027 నాటికి కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తవ్వాలి
– ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలి : పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షలో
– సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కృష్ణా నది పరివాహక ప్రాంతం 70 శాతం తెలంగాణలో, 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున 70 జలాల వాటా కోసం ట్రిబ్యునల్ వద్ద పట్టుబట్టాలని ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాల సాధనకు చేస్తున్న ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని జలసౌధలో రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గోదావరి బేసిన్ నుంచి పట్టిసీమ ద్వారా ఏపీ తీసుకుంటున్న 90 టీఎంసీలను ఎగువన వాడుకునేలా నీటి కోటా పెంచుకోవాలని చెప్పారు. ఈ అంశాలన్ని కృష్ణా బోర్డు దష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణానదిపై నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిర్ణీత నీటి వాటాల విషయంలో ప్రభుత్వ వాదనలు సమర్థంగా ఉండాలని అప్రమత్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. 2027 జూన్ నాటికి రాష్ట్రంలో కృష్ణానది పై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నొక్కిచెప్పారు. అందుకనుగుణంగా నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. వాటికి నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలనీ, స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సూదిని జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దండాపూర్ వరకు మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలన్నారు. ఉద్దండాపూర్ వరకు పెండింగ్లో ఉన్న పనులు 18 నెలల్లో పూర్తి చేయాలనీ, అందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి పెండింగ్లోని పనులు, కావాల్సిన నిధుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జలాల్లో 70 శాతం వాటా కోసం పట్టుబట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES