నవతెలంగాణ – హైదరాబాద్: టెక్ ప్రపంచంలో ఓ సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ను కొనుగోలు చేసేందుకు కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ పర్ప్లెక్సిటీ ముందుకొచ్చింది. భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఈ సంస్థ, క్రోమ్ కోసం ఏకంగా 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.02 లక్షల కోట్లు) ఆఫర్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గూగుల్ సంస్థ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ యాంటీ-ట్రస్ట్ ఆరోపణల కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్రౌజర్ మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని అడ్డుకునేందుకు క్రోమ్ను విక్రయించాలని అమెరికా న్యాయ విభాగం సూచిస్తున్న తరుణంలో, పర్ప్లెక్సిటీ ఈ భారీ ఆఫర్తో రంగంలోకి దిగింది. తమ కంపెనీ విలువ కంటే దాదాపు రెట్టింపు మొత్తాన్ని ఆఫర్ చేయడం ఈ స్టార్టప్ సాహసాన్ని తెలియజేస్తోంది. ఈ ఒప్పందానికి అవసరమైన నిధులను బయటి పెట్టుబడిదారుల ద్వారా సమీకరించనున్నట్లు పర్ప్లెక్సిటీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో వెల్లడించారు. బ్లూమ్బర్గ్ కథనం ప్రకారం, పలువురు ఇన్వెస్టర్లు ఈ డీల్కు పూర్తి ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే అంగీకరించారు. ఈ ఆఫర్ను ధ్రువీకరించిన పర్ప్లెక్సిటీ, ఒప్పందం విజయవంతమైతే క్రోమ్లో కొన్ని కీలక మార్పులు చేయబోమని స్పష్టం చేసింది.
క్రోమ్ కోర్ ఇంజిన్ అయిన ‘క్రోమియం’ను ఓపెన్ సోర్స్గానే కొనసాగిస్తామని, దాని అభివృద్ధికి ఏటా 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ముఖ్యంగా, వినియోగదారుల ఆందోళనలను తొలగిస్తూ, బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా గూగుల్నే ఉంచుతామని, తమ సొంత పర్ప్లెక్సిటీ సెర్చ్ను డిఫాల్ట్గా మార్చబోమని స్పష్టం చేసింది. పర్ప్లెక్సిటీ ప్రస్తుతం ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్తో పాటు ‘కామెట్’ పేరుతో సొంత బ్రౌజర్ను కూడా అందిస్తోంది. 2026 నాటికి వందల కోట్ల యూజర్లను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, గూగుల్ క్రోమ్ కొనుగోలుతో ఆ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని భావిస్తోంది.