నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమని చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లెలో పర్యటించిన సీఎం.. హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్, అధునాతన పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. టన్నెల్ బోర్ మిషన్తో పనులు చేయడం కష్టంగా మారిందని, పనులపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.
‘‘ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ రూ.1,968 కోట్లు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న టన్నెల్ పనుల్లో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేనాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10కి.మీ టన్నెల్ పూర్తి చేయలేదు. పెద్దగా కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారు. ఏపీలో జగన్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలకు నీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతో పట్టించుకోలేదు. కృష్ణా నది మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు.
గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు చెల్లించింది. ఆ మొత్తంలో కాళేశ్వరం కాంట్రాక్టర్లకే రూ.1.06 లక్షల కోట్లు చెల్లించారు. గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసింది. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదు’’ అని రేవంత్రెడ్డి అన్నారు.



