నవతెలంగాణ – రంగారెడ్డి: గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ కొందరికే చుట్టంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మొదటి రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంలో మాట్లాడి.. వారి విజయాలను, వినతులను విన్నారు. రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నాం. రైతును పట్టించుకోని వారు రాష్ట్రంలో, దేశంలో నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా రైతుల అండ ఉండాలని అన్నారు. 10 ఏళ్లు తెలంగాణను పాలించి రైతుల పేరుతో వీధి నాటకాలు ఆడుతున్నారు.
రైతులను నట్టేట ముంచిన వారు తమపై బురద జల్లుతున్నారని అన్నారు. 2014లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఎగ్గొట్టి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాము రైతులకు రుణమాఫీ అందజేశామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో వరి వేస్తే బోనస్ ఇస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రైతులు ఇబ్బందులు పడకూడదు అని రైతు భరోసా ఇస్తున్నామని, రానున్న 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల అందరి అకౌంట్లలో నిధులు జమ చేస్తామని అన్నారు.
ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు 70,11,984 మందికి రైతు భరోసా 9 రోజుల్లో అందిస్తాం అన్నారు. రైతుల కోసం ఇప్పటి వరకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను సరిదిద్దతున్నామని తెలిపారు. దేశంలో మొట్ట మొదటిసారిగా పేదలకు సనబియ్యం ఇస్తున్నామని అన్నారు. గత పాలకులు సర్పంచులకు చెల్లించాల్సిన రూ.1 లక్ష కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.60 వేల కోట్లు, ఉచిత కరెంటు పేరుతో అప్పులు.. ఇలా అందినకాడల్లా అప్పులు చేసి మొత్తంగా రూ.8 లక్షలకు పైగా అప్పులు తమ నెత్తిన పడేసి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.