Friday, June 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఖోమైనీని అంతమొందిస్తాం

ఖోమైనీని అంతమొందిస్తాం

- Advertisement -

– హెచ్చరించిన ఇజ్రాయిల్‌
– ఆర్మీ స్థావరాలపై క్షిపణులతో ఇరాన్‌ దాడి.. సొరొకో ఆస్పత్రికి అపార నష్టం
టెల్‌ అవీవ్‌, టెహరాన్‌:
గురువారం తెల్లవారుజామున దక్షిణ ఇజ్రాయిల్‌లోని ప్రధానమైన సొరొకో ఆస్పత్రిపై ఇరాన్‌ క్షిపణులతో దాడి చేసింది. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాకపోయినా అపారమైన నష్టం సంభవించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అలాగే టెల్‌ అవీవ్‌కు సమీపంలోని బహుళ అంతస్తుల భవనాలు, నివాస భవంతులపైనా క్షిపణల దాడులు జరిగాయి. మొత్తంగా సెంట్రల్‌, దక్షిణ ఇరాన్‌ల్లో నాలుగు ప్రాంతాల్లో ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయిల్‌కు తీవ్రమైన నష్టాన్ని, విధ్వంసాన్ని కలిగించాయి. వంద మందికి పైగా గాయపడ్డారు. తాజాగా గురువారం ఇజ్రాయిల్‌ ఆర్మీ స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులకు పాల్పడింది. ప్రధానంగా దక్షిణ ఇజ్రాయిల్‌లోని ఇజ్రాయిల్‌ ఆర్మీ కమాండ్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయం, బిర్షెబాలోని గవ్‌ – యామ్‌ టెక్నాలజీ పార్క్‌లోని సైనిక నిఘా శిబిరాల్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ క్షిపణి దాడి చేసిందని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజెన్సీ టెలిగ్రామ్‌లో వెల్లడించింది. అయితే ఆర్మీ ప్రధాన స్థావరాలు బిర్షెబాలోని సోరోకా ఆస్పత్రి పక్కనే ఉండడంతో ఈ దాడుల ప్రభావం ఆ ఆస్పత్రిపై కూడా పడిందని ఇరాన్‌ మీడియా పేర్కొంది.
ఈ దాడిలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాల య్యాయని, 25మంది స్వల్పంగా గాయపడ్డారని ఇజ్రాయిల్‌కు చెందిన ఎమర్జన్సీ సర్వీసెస్‌ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజా ఇరాన్‌ దాడులు కలిగించిన విధ్వంసంపై స్పందిస్తూ , ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీని అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాల్లో ఒకటని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ ప్రకటించారు. సొరొకో అస్పత్రిని సందర్శించిన ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, ఖోమైనీని లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని తోసిపుచ్చ లేమన్నారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని, అన్ని అవకాశాలను, మార్గాలను పరిశీలిస్తున్నామని, దీని గురించి మీడియాలో మాట్లాడకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. గురువారం రాత్రికి భద్రతా కమిటీతో సమావేశం నిర్వహించనున్నారు.
639మంది మృతి
ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 639మంది మరణించారని, వీరిలో 263మంది సామాన్య పౌరులని ఇరాన్‌ మానవ హక్కుల గ్రూపు తెలిపింది. మరో 1300మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు ప్రతిగా ఇరాన్‌ దాదాపు 400 వరకు క్షిపణులను, వందలాది డ్రోన్లను ప్రయోగించింది. ఇజ్రాయిల్‌లో ఈ దాడుల్లో 24మంది మరణించగా, వందలా దిమంది గాయపడ్డారు.
సాయం కోరుతున్నారంటే బలహీనపడ్డారనే ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా, దాని మిత్ర దేశాలు రంగంలోకి దిగుతున్నాయని, అంటే ఇజ్రాయిల్‌ బలహీనపడిందనే అర్ధమని ఖోమైనీ ఎక్స్‌పోస్టులో పేర్కొన్నారు.
ముప్పు ఎదురైతే మూసివేత తప్పదు
ఇరాన్‌ కీలక ప్రయోజనాలకు ముప్పు ఎదురైనపుడు హోర్ముజ్‌ జలసంథిని ఇరాన్‌ మూసివేస్తుందని సీనియర్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. తన శత్రువులపై స్పందించేందుకు ఇరాన్‌ వద్ద అనేక మార్గాలు, అవకాశాలు వున్నాయని, అయితే పరిస్థితులను బట్టి ఆ మార్గాలు మారుతుంటాయని పార్లమెంట్‌ సభ్యుడు బెన్‌హమ్‌ సయీది చెప్పారు. రోజువారీ అంతర్జాతీయంగా అవసరమయ్యే చమరు వినియోగంలో 20శాతం ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. గతంలో కూడా పశ్చిమ దేశాల నుంచి ఒత్తిళ్ళు ఎదురైనపుడు ఇరాన్‌ ఈమేరకు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.
చెర్నొబిల్‌ తరహా విపత్తు : రష్యా హెచ్చరిక
మరోవైపు ఇరాన్‌కి చెందిన అరక్‌ భార జల రియాక్టర్‌పై ఇజ్రాయిల్‌ తాజాగా దాడులు చేసింది. ఇరాన్‌లోని బుషెర్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌పై దాడి చేస్తే చెర్నొబిల్‌ తరహా విపత్తు సంభవిస్తుందని రష్యా అణు ఇంధన కార్పొరేషన్‌ చీఫ్‌ గురువారం హెచ్చరించారు. ఇరాన్‌లో పనిచేసే అణు విద్యుత్‌ ప్లాంట్‌ బుషెర్‌ ఒక్కటే, దీన్ని రష్యా నిర్మించింది. బుషెర్‌ ప్లాంట్‌వద్ద పనిచేసే రష్యా కార్మికులు సురక్షితంగా వుంటారని, వారికి వచ్చిన భయమేదీ లేదని ఇజ్రాయిల్‌ తమకు హామీ ఇచ్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గురువారం ఉదయం విలేకర్లతో మాట్లాడుతూ చెప్పారు.
తగు రీతిలో స్పందన
ఇరాన్‌ చమురు నష్టాలను పూడ్చేందుకు సౌదీ రంగంలోకి దిగుతుందా అని ప్రశ్నించగా వాస్తవిక పరిస్థితులకు తగినట్లుగా ప్రతిస్పందిస్తామని సౌదీ ఇంధన శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ సల్మాన్‌ తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన వేళ గతవా రం చమురు ధరలు 10 డాలర్లుకు పైగా పెరిగాయి.
ఇరాన్‌పై బలప్రయోగం వద్దు : అమెరికాకు చైనా హెచ్చరిక
ఇజ్రాయిల్‌-ఇరాన్‌ ఘర్షణల్లో అమెరికా జోక్యాన్ని చైనా తీవ్రంగా విమర్శించింది. ఇరాన్‌పై బలప్రయోగానికి దిగొద్దని అమెరికాను చైనా హెచ్చరించింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గువో జియాకున్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..’ఇతర దేశాల సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే ఏ చర్యనైనా చైనా వ్యతిరేకిస్తుంది. అలాగే అంతర్జాతీయ సంబంధాలలో బలప్రయోగం లేదా బెదిరింపులను చైనా వ్యతిరేకిస్తుంది’ అని తెలిపారు. కాగా, ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడుల పట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా కజకస్తాన్‌లో ఐదు మధ్య ఆసియా దేశాలతో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో జిన్‌పింగ్‌ మాటా డుతూ. ‘ వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించ డానికి, పరిస్థితి దిగజారకుండా నిరోధించడానికి అన్ని పక్షాలు కృషి చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. శాంతిని పునరుద్ధరించడంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -