Saturday, June 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీడు భూములను సస్యశ్యామలం చేస్తాం

బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం

- Advertisement -

– ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్ర అభివృద్ధి : దేవరకద్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ / నవాబుపేట

”వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం.. అందుకు కావాల్సిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తాం.. ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది” అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం దేవరకద్ర నియోజక వర్గం మూసాపేట, నవాబుపేట మండలాల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కొండాపూర్‌ రుద్రారం, చౌడూర్‌ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. అనంతరం మూసాపేట మండలంలో ఎమ్మెల్యే జై మధుసూదన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఆర్‌అండ్‌ఆర్‌, భూ సేకరణకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. నార్లాపూర్‌, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు. ఉద్దండపూర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి రూ.70 కోట్లు విడుదల చేశామని, భవిష్యత్‌లో ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు చేయాలనుకుంటే ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదని.. ప్రజల గొంతుకై శాసనసభలో మాట్లాడి వారి అవసరాలను తీర్చి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ పెంచేలా పని చేయాలని సూచించారు. కృష్ణా నది ఒడ్డున ఉన్న పాలమూరు బిడ్డలు ఆ నీళ్లను వారి భూముల్లో పారించుకు నేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నారని చెప్పారు. కానీ, పదేండ్లలో గత పాలకులు ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు.
ఏ పథకాన్నీ రద్దు చేయలేదు :
మంత్రి జూపల్లి కృష్ణారావు
గత ప్రభుత్వం చేపట్టిన ఏ సంక్షేమ పథకాన్నీ రద్దు చేయలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. గత పాలకులు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్‌ రాదని ప్రచారం చేశారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17మాసాల్లో నిరాటంకంగా కరెంట్‌ సరఫరా చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి రూ.65 వేల కోట్ల అప్పులు ఉండేవని, 65 సంవత్సరాలలో 22 మంది ముఖమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో పాలించారని, 80 పైసల వడ్డీ చొప్పున నెలకు రూ.600 కోట్ల వడ్డీ చెల్లించారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఒక్క సీఎం చేసిన అప్పు రూ.7 లక్షల 30 వేల కోట్లని, దానికి నెలకు రూ.6500 కోట్ల చొప్పున 17 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష 20 వేల కోట్ల పై చిలుకు వడ్డీనే చెల్లించిందన్నారు.
ఈ సందర్భంగా మైనార్టీ మహిళలకు 200 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు మంజూరు చేశారు. సభలో ఎమ్మెల్యేలు అనిరుద్‌రెడ్డి, మేఘారెడ్డి, కలెక్టర్‌ జి.విజయేందిరబోయి, ట్రాన్స్‌కో సీఎండి కృష్ణ భాస్కర్‌, టిజిఎస్‌ పీసీడీ ఎల్‌.సి.ఎం.డి. ముషారఫ్‌ అలీ, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, డీసీబీబి చైర్మెన్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -