Thursday, June 5, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునిఖార్సైన రికార్డులు తయారు చేస్తాం

నిఖార్సైన రికార్డులు తయారు చేస్తాం

- Advertisement -

– భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం
– నాట్లకు ముందే రైతు భరోసా జమ
– మళ్లీ అసైన్డ్‌ కమిటీలు వేస్తాం : భూ భారతి సర్వే పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఎర్రుపాలెం

భూ సమస్యలన్నీ ధరణి చట్టంతోనే వచ్చాయని, తాము తీసుకొస్తున్న భూభారతి చట్టం ద్వారా నిఖార్సైన రికార్డులు తయారు చేసి రైతుల భూములకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూ భారతి సర్వే పైలట్‌ ప్రాజెక్టును మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నాయకులు వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు భూములు కట్టబెట్టి తిరిగి సవరణ చేసే అవకాశం లేకుండా ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని, పది ఎకరాల భూమి ఉంటే 17 ఎకరాలకు పాస్‌ బుక్కులు ఇచ్చారని ఆరోపించారు. అయితే ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ధరణి చట్టాన్ని తాము బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రైతుల భూములు సర్వే చేయించి సంపూర్ణంగా సరిహద్దులు గుర్తించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యమన్నారు. భూ సంస్కరణల చట్టంలో భాగంగా రాష్ట్రంలో 26 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు పంచిందన్నారు. దాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి చట్టంలోని పార్ట్‌ బీలో పెట్టిందని, ఎటువంటి విచారణ చేయలేదన్నారు. తిరిగి ఆయా అసైన్డ్‌ భూములన్నింటినీ విచారించి అర్హులైన హక్కుదారులం దరికీ భూ పట్టాలు ఇచ్చి వారిని భూమిలో కూర్చోబెడ తామన్నారు. భూమిలేని పేదలకు సాగుభూమి, ఇండ్ల స్థలాలు ఇచ్చి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోని అసైన్డ్‌ కమిటీలను భూ భారతి చట్టంతో తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆబాది భూమిని సర్వే చేసే అవకాశం కొత్త చట్టం కల్పిస్తుందన్నారు. ప్రతేడాది రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఎవరు భూములు అమ్మారు.. ఎవరు కొన్నారు.. వంటి అంశాలపై భూ రికార్డుల్లో జరిగిన మార్పులను గ్రామ సభ ద్వారా వివరించే అవకాశాన్ని భూ భారతి చట్టం కల్పిస్తుందన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద సర్వే చేపడుతున్నామంటే ములుగుమాడు ఊరంతా కదిలి రావడం సంతోషకరమన్నారు.
దేశానికే మణిహారం భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం దేశానికే మణిహారంవంటిదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15న ధరణి నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. తద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. రాష్ట్రంలో 413 రెవెన్యూ గ్రామాల్లో నక్షాలు లేవని, అయిదు గ్రామాలను సర్వే చేసేందుకు ఎంపిక చేసి పైలెట్‌ ప్రాజెక్టులుగా అయిదు సంస్థలకు ఇచ్చామన్నారు. తాము గత ప్రభుత్వంలో మాదిరిగా ఒక్కరికే ఇవ్వలేదన్నారు. ప్రతి రైతుకూ భూదార్‌ నెంబర్‌ ఇస్తామన్నారు. ప్రతి రెవెన్యూ విలేజ్‌కి వీఆర్‌ఓను ఇస్తామన్నారు.
నాట్లకు ముందే రైతు భరోసా జమ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నాట్లకు ముందే రైతు భరోసా నిధులు ప్రభుత్వం జమ చేయనున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు నుంచి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తమ శక్తి మేరకు వేగవంతంగా సర్వే చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న తక్కువ విస్తీర్ణం భూమికి కూడా కొన్ని చోట్ల పట్టాల్లో వేల ఎకరాలు ఉన్నట్టు ఉందని, దీని వల్ల ప్రభుత్వంపై భారం పడుతోందన్నారు. భూముల రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు, భూ యజమానుల నుంచి టోకెన్‌ అమౌంట్‌ సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ సీసీఎల్‌ నవీన్‌ మిట్టల్‌, కలెక్టర్‌ ముజ్మిల్‌ ఖాన్‌, జేడీఎల్‌ ప్రసన్నలక్ష్మి, వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్‌, మధిర మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బండారు నరసింహారావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదిరతరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -