సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పేదలకు న్యాయం జరిగే వారి పక్షాన సిపిఐ పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ అన్నారు. కొలనుపాకలో అర్హులైన పేదలకు ప్రభుత్వ భూమి, ళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆలేరులోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా పేదల పక్షాన కొలనుపాక లోని ప్రభుత్వ భూములపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు నిర్వహించినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కొలనుపాకలోని ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేసేంతవరకు ఉద్యమిస్తామన్నారు. కార్పొరేట్ కంపెనీలకు వందలాది ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వం పేదలకు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకెపి సెంటర్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదు అన్నారు. పేదలను నిర్లక్ష్యం చేసి వారి యోగక్షేమాలు పట్టించుకోని ప్రభుత్వాలపై ఉద్యమిస్తామన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆలేరు తాసిల్దార్ ఆంజనేయులు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల కార్యదర్శి చౌడు బోయిన కనకయ్య, నాయకులు పోతు ప్రవీణ్,భవాని,పార్వతి,సంపత్ యాదమ్మ,,సుశీల,సరిత,సంధ్య లక్ష్మీ ఉన్నారు.
పేదల పక్షాన ఉద్యమిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES