Monday, June 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంతీవ్రంగా స్పందిస్తాం

తీవ్రంగా స్పందిస్తాం

- Advertisement -

– ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక
– ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య వరసగా మూడో రోజు క్షిపణి దాడులు
– ఆత్మరక్షణ కోసమే ప్రతిదాడులు.. అందుకు అంగీకరిస్తే ఆపేస్తాం : ఇరాన్‌
– నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదంగా మారటంతో వాయిదా
ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ చేస్తున్న భీకర దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. అయినా లెక్కచేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే.. తమ సాయుధ దళాలు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో.. టెహరాన్‌పై విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇరాన్‌ ఏ రూపంలో దాడి చేసినా తాము పూర్తి శక్తితో వాటిని తిప్పి కొడతామన్నారు. టెహ్రాన్‌-టెల్‌ అవీవ్‌ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడం తనకు చాలా ఈజీ అని ట్రంప్‌ పేర్కొన్నారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు.
వాషింగ్టన్‌ :
ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇరాన్‌ పూర్తిగా నాశనం అవ్వకముందే తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్‌ ఇప్పటికే టెహరాన్‌ను హెచ్చరించారు. ఈ మారణ హౌమం ఇలాగే కొనసాగితే ఇరాన్‌లో ఏమీ మిగలదన్నారు. ఒకప్పుడు ఇరానియన్‌ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడు కోవాలంటే అక్కడి పాలకులు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్థరహితమని ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పష్టంచేశారు. ఒకవైపు తమపై దాడులకు మద్దతునిస్తూ.. మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని అన్నారు. తాము ఇజ్రాయిల్‌పై చేస్తున్న దాడులను ఆపడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ వంటి దేశాలు ఇజ్రాయిల్‌కు సహకరిస్తే ఆయా దేశాలకు చెందిన స్థావరాలపై దాడులు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో..అదే జరిగితే కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రతిస్పందిస్తామని ట్రంప్‌ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.
కొద్ది రోజులుగా ఇరాన్‌, అమెరికా మధ్య అణుఒప్పందం కోసం ఒమన్‌ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 5 భేటీలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇజ్రాయిల్‌ -ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఒమన్‌లో ఆదివారం జరగాల్సిన ఆరో విడత చర్చలను రద్దు చేసుకున్నారు.
యుద్ధం కోసం కుమారుడి పెళ్లి వాయిదా.. ఇజ్రాయిల్‌ ప్రధాని ప్రకటన
ఇజ్రాయిల్‌ -ఇరాన్‌ మధ్య పరస్పర దాడులతో పశ్చిమా సియా రగిలిపోతోంది. ఐడీఎఫ్‌ దళాలు అటు గాజా.. ఇటు ఇరాన్‌పై వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు తన కుమారుడి వివాహం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివాహ వేడుకను వాయిదా వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదస్పదంగా మారింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ఆయన ఇంట వేడుకలు నిర్వహిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన ఈ వేడుకను వాయిదా వేయడానికి ఇది కారణమై ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆత్మరక్షణ కోసమే ప్రతిదాడులు..అందుకు అంగీకరిస్తే ఆపేస్తాం: ఇరాన్‌
అణుస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులకు దిగిన ఇజ్రాయిల్‌పై అంతే స్థాయిలో ప్రతిదాడి చేసిన ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌పై ఇజ్రాయిల్‌ సైనిక చర్యను నిలిపివేస్తే.. తాము కూడా దాడులు ఆపేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్‌ అరాక్చీ వెల్లడిం చారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు వందల సంఖ్యలో క్షిపణులను ఇరాన్‌ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సుమారు 10 మంది మ ృతి చెందగా.. 200 మంది వరకు గాయపడినట్టు ఇజ్రాయిల్‌ వెల్లడించింది.
పరిస్థితులు డిమాండ్‌ చేస్తే తప్ప ఇజ్రాయిల్‌తో వివాదాన్ని పొరుగుదేశాలకు విస్తరించాలని ఇరాన్‌ భావించడం లేదని అబ్బాస్‌ అరాక్చీపేర్కొన్నారు. మరోవైపు టెహ్రాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తే తమకు ముప్పు ఉందని, దానిని అడ్డుకునేందుకే అణు స్థావరాలపై దాడులు చేస్తున్నామని ఇజ్రాయిల్‌ వాదిస్తోంది. వాటిని సమూలంగా నేలమట్టం చేసేంత వరకు దాడులు కొనసాగిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో అబ్బాస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇజ్రాయిల్‌ది వ్యూహాత్మక తప్పిదం
ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్‌ క్షేత్రమైన ‘ది సౌత్‌ పార్స్‌ క్షేత్రం’పై ఇజ్రాయిల్‌ దాడి చేయడం పట్ల అబ్బాస్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్షేత్రాన్ని ఖతార్‌ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్టు చెప్పిన ఆయన.. ఇజ్రాయిల్‌ దుందుడుకు చర్యకు ఇదో ఉదాహరణ అని అన్నారు. యుద్ధాన్ని విస్తరించాలన్న కాంక్షతోనే ఇలాంటి ప్రమాదకర చర్యకు పాల్పడిందని వ్యాఖ్యానించారు. ”వివాదాన్ని పర్షియన్‌ గల్ఫ్‌ వరకు లాగడం ఓ వ్యూహాత్మక తప్పిదం, యుద్ధాన్ని ఇరానియన్‌ భూభాగం దాటి విస్తరించాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయిల్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది” అని అబ్బాస్‌ అన్నారు.

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య వరసగా మూడో రోజు దాడులు
ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య వరసగా మూడో రోజు కూడా దాడుల పరంపర కొనసాగింది. ఇరు దేశాల ఆదివారం కూడా పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. మూడో రోజు కూడా ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై భారీ వైమానిక దాడులకు తెగబడింది. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. రాజధాని టెహరాన్‌ సమీపంలోని ఒక చమురు శుద్ధి కర్మాగారాన్ని, బుషెహర్‌ ప్రావిన్స్‌లోని మరొక చమురు శుద్ధి కర్మాగారాన్ని ఇజ్రాయిల్‌ లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్‌ చెప్పింది. కాబట్టే తమ ప్రతీకార దాడులు ఇజ్రాయిల్‌లోని ఆర్థిక ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది.. ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా ఇరాన్‌లో గతరెండు రోజుల్లో దాదాపు 80 మంది మరణించగా, 800 మంది గాయపడ్డారు. మరోవైపు ఇరాన్‌ చేసిన దాడుల్లో ఇజ్రాయిల్‌లో ఇప్పటి వరకూ 13 మంది మరణించారు. ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వరుసగా మూడో రోజైన ఆదివారం కూడా ఇజ్రాయిల్‌ ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం, గగనతలాన్ని మూసివేశారు.

డేంజర్‌ లైన్‌ దాటేసింది
అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఇరాన్‌లోని అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ ఇప్పటికే డేంజర్‌ లైన్‌ దాటేసిందని అబ్బాస్‌ అన్నారు. ఇరాన్‌- అమెరికా మధ్య అణు చర్చలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ తరహా పరిస్థితులు ఎదురుకాకపోతే అమెరికాతో అణు ఒప్పందానికి మార్గం తెరిచే ఉండేదని అన్నారు. ఇజ్రాయిల్‌ దాడులకు అమెరికా మద్దతిస్తున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అగ్రరాజ్యం గ్రీన్‌ సిగల్‌ ఇవ్వకపోతే ఇజ్రాయిల్‌ తమపై దాడి చేసి ఉండేది కాదని తెలిపారు. తన తప్పు లేదని అమెరికా నిరూపించుకోవాలంటే ఇజ్రాయిల్‌ దాడులను బహిరంగంగా ఖండించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా టెల్‌ అవీవ్‌ చేస్తున్న దాడులపై ఐక్యరాజ్యసమితి ఉదాసీనత చూపిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌ను కాదని, పాశ్చాత్య దేశాలు ఇరాన్‌ను తప్పుబడుతున్నాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -