నవతెలంగాణ-హైదరాబాద్ : దొంగ ఓట్లను గుర్తించడానికి, వాటిని సరిచేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విజయవంతంగా పూర్తయిందని స్పష్టం చేసింది. మరో 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించబోతున్నట్లు తెలిపింది.
అండమాన్ నికోబార్ దీవులు, గోవా, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, లక్షద్వీప్లలో మంగళవారం నుండి ఎస్ఐఆర్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ చేపట్టనున్న 12 రాష్ట్రాల్లో 51కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, మొత్తంగా 5.33లక్షల బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ)లను పనిచేయనున్నారని ప్రకటించారు. వీరితో పాటు రాజకీయ పార్టీలు 7లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఎ) నియమించనున్నాయని, బిఎల్ఓ, బిఎల్ఎలకు మంగళవారం నుండి నవంబర్ 3 వరకు ముద్రణ, శిక్షణ ప్రారంభమవుతుందని, ఆతర్వాత నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 వరకు ఇంటింటి గణన ఉంటుందని తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను డిసెంబర్ 8న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలను, ఫిర్యాదులను డిసెంబర్ 9 నుండి 2026 జనవరి 8 వరకు స్వీకరిస్తామని, విచారణ జనవరి 31 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 7న ప్రచురించబడుతుందని సిఇసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
దేశ వ్యాప్తంగా ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో సవరణలు తప్పనిసరి అని పేర్కొంది. గతంలో 21 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తుచేసింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితా సీజ్ చేస్తామని సీఈసీ కీలక ప్రకటన చేసింది. మరోవైపు ఈ SIR కార్యక్రమాన్ని విపక్షాలు వ్యకిరేకిస్తున్న విషయం తెలిసిందే.



