Thursday, June 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ ఎంపీటీసీ కుటుంబానికి అండగా ఉంటాం

మాజీ ఎంపీటీసీ కుటుంబానికి అండగా ఉంటాం

- Advertisement -

– మాజీ మంత్రి కేటీఆర్‌
– కుంటయ్య మృతదేహానికి నివాళి
– కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ-సిరిసిల్ల టౌన్‌

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కుంటయ్య సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. బుధవారం జిల్లా ఆస్పత్రిలో కుంటయ్య మృతదేహానికి కేటీఆర్‌ నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు తన కోసం హైదరాబాద్‌ వచ్చి ధైర్యం చెప్పిన కుంటయ్య అదే రోజు రాత్రి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలను పంపి ఆయనను కాపాడుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదన్నారు. కుంటయ్య ఇద్దరు పిల్లల చదువులు, వారి వివాహాలు, ఇతర సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదేనని కేటీఆర్‌ భరోసా కల్పించారు. కుంటయ్య కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం కుంటయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుంటయ్య మృతి పట్ల చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సంతాపం తెలిపారు. అంత్యక్రియల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోలీస్‌ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారాయి: కేటీఆర్‌
రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లు సెటిల్‌మెంట్లకి అడ్డాలుగా మారుతున్నాయని కేటీఆర్‌ ఆరోపణలు చేశారు. అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పిన విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనకు న్యాయం చేయాలని కుంటయ్య ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా తిరిగి అతనిపైనే కేసు పెట్టడం అమానుషమని అన్నారు.
కుంటయ్యకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. భూతగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం మంచిది కాదని సూచించారు. తాము అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో కాంగ్రెస్‌ నాయకుల మాదిరిగా దిగజారి ప్రవర్తించలేదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -