Friday, June 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాకు అండగా వుంటాం

గాజాకు అండగా వుంటాం

- Advertisement -

– ప్రభుత్వాలతో పనిలేదు, ప్రజలే ఏకమవుదాం
– 50కి పైగా దేశాలు..వేలాదిమంది వలంటీర్లు
– నేడు గ్లోబల్‌ మార్చ్‌ టు గాజా ప్రారంభం
– కాలినడకన కైరో టు రఫా
గాజా :
గత 20 మాసాలుగా ఇజ్రాయిల్‌ కబంధ హస్తాల్లో చిక్కుకుని అల్లాడుతున్న గాజా ప్రాంతంలోకి కాలి నడకన ప్రవేశించాలని, పాలస్తీనియన్లకు తమ సంఘీభావాన్ని ప్రకటించాలనే బృహత్‌ లక్ష్యంతో ‘గ్లోబల్‌ మార్చ్‌ టు గాజా’ ప్రారంభమైంది. 50కి పైగా దేశాలకు చెందిన కార్మిక సంఘాలు, సంఘీభావ ఉద్యమాలు, మానవ హక్కుల సంస్థలతో కూడిన అంతర్జాతీయ సంకీర్ణం ఈ మేరకు చర్యలు చేపట్టింది. గాజాలో ఇజ్రాయిల్‌ దిగ్బంధనాన్ని అంతమొందించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున వేలాదిమంది అంతర్జాతీయ స్థాయిలోని వలంటీర్లు కైరో నుండి రఫాకు బయలుదేరనున్నారు. గాజాలో ప్రజలు పడుతున్న కష్టాలు, దుర్భిక్షం, నిరంతరాయంగా బాంబు దాడులతో అక్కడ నెలకొన్న విపత్కర పరిస్థితులను బయటి ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో ఈ మార్చ్‌ ప్రారంభమవుతోంది.
కీలక లక్ష్యాలు
పాలస్తీనా అంతర్జాతీయ సంఘీభావ ఉద్యమంలో ఇదొక మైలురాయి అని పేర్కొనవచ్చు. గాజాలో క్షామాన్ని అంతమొందించాలని, రఫా క్రాసింగ్‌ వద్ద నిలిచిపోయిన వేలాది ఆహార ట్రక్కులను లోపలకు ప్రవేశించేలా చూడాల ని, సుస్థిరమైన, శాశ్వతమైన మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయాలని, ఇజ్రాయిల్‌ నేరాలు, దుష్ట పన్నాగాల ను ఎండగట్టాలని, అక్కడి పరిస్థితులకు బాధ్యులైన వారిని జవాబుదారిగా ప్రకటించాలనేది ఈ మార్చ్‌ కీలక లక్ష్యాలుగా వున్నాయి. గాజా ప్రజలపై ఇజ్రాయిల్‌ మారణకాండ సాగిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా మౌనం రాజ్యమేలుతుండడాన్ని ప్రశ్నిస్తూ, తక్షణమే కార్యాచరణకు దిగాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు, హక్కుల గ్రూపులు, వైద్య రంగం, పౌర సమాజానికి చెందిన వేలాదిమంది ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారు.
రాజకీయాల్లేవ్‌
గ్లోబల్‌ మార్చ్‌ టు గాజా అంతర్జాతీయ కమిటీ సభ్యు డు సయీఫ్‌ అబూ కెషక్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది కేవలం మానవతా దృక్పథంతో తీసుకుంటున్న చర్య మాత్రమేనని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, అది óకారిక స్పాన్సర్‌షిప్‌ కూడా లేదని స్పష్టం చేశారు. ఇందులో పాల్గొనే వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, తమ వంతు సాయాన్ని చేస్తూ అంతర్జాతీయ సంఘీభావాన్ని బలోపేతం చేసేవారేనని చెప్పారు. తద్వారా ఉదాసీనంగా వ్యవహరించే ప్రభుత్వాలపై ప్రజల ఒత్తిడిని పెంచుతామన్నారు.
కైరో నుండి రఫాకు
గురువారం వివిధ దేశాలకు చెందిన వలంటీర్లు ఈజిప్ట్‌ రాజధాని కైరో చేరుకుంటారు. అక్కడ అరిష్‌ నగరా నికి వెళ్ళి, అక్కడనుండి కాలి నడకన ప్రదర్శనగా రఫాకు 15వ తేదీనాటికి చేరుకుంటారు. కేవలం రఫా చేరుకోవడం తో సరిపోదని, ఆ క్రాసింగ్‌ దగ్గర ధర్నా నిర్వహిస్తామని, దాన్ని తెరిచి ఆహార ట్రక్కులను లోపలకు అనుమతించేలా అధికారులపై ఒత్తిడి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. మార్చ్‌ మొత్తంగా శాంతియుతంగా జరుగుతుందని జర్మనీ లాయర్‌ మెలనీ షూవిట్జర్‌ చెప్పారు. రాజకీయ, సాంస్కృతిక ఎల్లలు అధిగమించి సమైక్య వాణితో మానవతా దృక్పథంతో కూడిన సందేశాన్ని చేరవేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈజిప్ట్‌ ఎంబసీలతో నిర్వాహకులు నిరంతరంగా సంబంధాలను కలిగివున్నారని ఐరిష్‌ కార్యకర్త కరేన్‌ చెప్పారు. ఇంత క్రూరత్వం చోటు చేసుకుంటున్నా అంతర్జాతీయంగా మౌనం రాజ్యమేలుతోందని, ఇలాంటి మౌనాన్ని చరిత్ర ఎన్నటికీ క్షమించదని ఆమె వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌ దురాగతాలపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు, ఖండనలు వెల్లువెత్తుతున్న వేళ, ప్రపంచ దేశాల ఆగ్రహావేశాల నేపథ్యంలో ఈ మార్చ్‌ జరుగుతోంది.
ట్యునీషియా బాటలోనే
ఇదే రీతిలో లాండ్‌ కాన్వారు పేరుతో ప్రాంతీయ స్థాయిలో ముఖ్యంగా ట్యునీషియా చేపట్టిన కార్యాచరణ తరహాలోనే అంతర్జాతీయ స్థాయి చొరవ సాకారం దాల్చడం విశేషం. ట్యునీషియాకు చెందిన పౌర సంఘాలు, ప్రధాన కార్మిక సంఘాలు, విద్యార్ధి గ్రూపులు, యువజన ఉద్యమాలకు చెందిన వేలాదిమంది మే మధ్య నుండి గాజాకు కాన్వారుగా వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ట్యునిస్‌ నుండి కైరో మీదుగా గాజా చేరాలన్నది వీరి లక్ష్యంగా వుంది. వేలాదిమంది ట్యునీషియన్లు బస్సుల్లో కైరో చేరుకుంటున్నారు. 9న వీరు ట్యునిస్‌ నుండి బయలుదేరారు. రాబోయే రోజుల్లో దాదాపు 2వేల మంది లిబియా, ఈజిప్ట్‌ల గుండా ప్రయాణించి కైరో నుండి అరిష్‌ మీదుగా రఫా చేరుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -