Friday, June 6, 2025
E-PAPER
Homeఆటలుభారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరించి..

భారతీయ సంప్రదాయ వస్త్రాలు ధరించి..

- Advertisement -

– పోచంపల్లి, యాదగిరిగుట్టలో మిస్‌వరల్డ్‌ పోటీదారుల పర్యటన
నవతెలంగాణ – భువనగిరి, యాదగిరిగుట్ట/ భూదాన్‌ పోచంపల్లి
ప్రపంచ విశ్వసుందరి పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన మిస్‌వరడ్డ్‌ పోటీ దారులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, యాదగిరిగుట్టను సందర్శించారు. రెండు బృందాలుగా ఆయా ప్రాంతాలను సందర్శించిన వారికి అధి కారులు భారీగా స్వాగతం పలికారు. తొమ్మిది మంది అందాల భామలు యాదగిరిగుట్టపైన అతిథి గృహానికి చేరుకున్నారు. ఆలయ పండితులు, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా వచ్చి వారికి స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ అతిథి గృహంలో ప్రొజెక్టర్‌ ద్వారా ఆలయ విశిష్టతను పోటీదారులకు వైస్‌ చైర్మెన్‌ కిషన్‌రావు వివరించారు. అనంతరం వారు భారతీయ సంప్రదాయ వస్త్రాలైన లంగా వోణీలు, చీర, బొట్టు, పూలు పెట్టుకుని తయారయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ మాడ వీధులకు చేరుకున్నారు. సన్నాయి మేళాలతో మొదట అఖండ దీప మండపానికి చేరుకొని దీపారాధన చేశారు. మీడియా పాయింట్‌ వద్ద చేతులు ఊపుతూ చిరునవ్వులు చిందించారు. వారికి తూర్పు గోపురం వద్ద కోలాట బృందంతో, నెమలి, శాస్త్రీయ నృత్యాలతో స్వాగతం పలికారు. తూర్పు ద్వారం కార్నర్‌ టర్నింగ్‌ పాయింట్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. గర్భాలయంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి వేద పండితులు, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటా చార్యులు ప్రత్యేక పూజలు చేశారు. పోటీ దారులకు దేవాలయ ప్రాంగణంలో ఆలయ పండితులు శాలువా పుష్ప గుచ్చాలతో, అక్షింతలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, పర్యాటక శాఖ అధికారులు, పోలీస్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పోచంపల్లికి 25మంది అందాల భామలు
25 దేశాలకు చెందిన మిస్‌వరల్డ్‌ పోటీదారులు భూదాన్‌ పోచంపల్లిని సందర్శించారు. గురువారం సాయంత్రం పోచంపల్లి టూరిజం పార్క్‌కు చేరుకున్న సుందరీమణులకు ఇన్‌చార్జ్జి డాక్టర్‌ లక్ష్మి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ రెడ్డి, రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు, డీసీపీ ఆకాంక్ష యాదవ్‌, ఉపేందర్‌రెడ్డి, ఏసీపీ మధుసూదన్‌ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. వారికి బొట్టు తిలకం పెట్టి శాలువాలతో సత్కరించారు. ఆ తర్వాత వారు టెర్రకోట కొండలను పరిశీలించారు. మ్యూజియంలో రాట్నం, మగ్గం, రంగుల అద్దకాలు, దారం, చేనేత వస్త్రాల తయారు విధానాన్ని, అందమైన ఫొటోలు ఏర్పాటు చేయగా వాటిని తిలక రించారు. పోచంపల్లి ఇక్కత్‌ చీరల ప్రాధా న్యాన్ని వారికి వివరించారు. ఏడు స్టాల్స్‌లో పెట్టిన గద్వాల, సిద్దిపేట, నారాయణపేట, గొల్లభామ చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వాతి రూపొందించిన ఇండో వెస్టన్‌ ఇక్కత్‌ వస్త్రాలతో ర్యాంపు వాక్‌ చేశారు. చేనేత వస్త్రాలతో ఫ్యాషన్‌ షో.. స్క్రీన్‌పై చేనేత దృశ్యాలను వీఐపీలతోపాటు మిస్‌వరల్డ్‌ పోటీదారులు వీక్షించారు.
వాహనదారుల ఇబ్బందులు, నాయకుల అరెస్టు
భూదాన్‌పోచంపల్లిలో మిస్‌వరల్డ్‌ పోటీదారులు పర్యటన నేపథ్యంలో వారు వచ్చిన, వెళ్లిన సమయాల్లో వాహనాలను పోలీసులు పూర్తిగా నిలిపేయడంతో వాహన దారులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు సీపీఐ(ఎం) నాయకులను అరెస్టు చేసి కార్యక్రమం అనంతరం వదిలిపెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -