– తల్లిదండ్రులకూ పుష్పగుచ్చాలిచ్చి అభినందించిన ఉపాధ్యాయులు
– మొదటి రోజు ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
– పుస్తకాలు, యూనిఫాం పంపిణీ
– కొన్ని చోట్ల తరగతి గదుల కొరత
– బడి బాట కార్యక్రమంతో స్పందన.. పెరిగిన అడ్మిషన్లు
– మూతపడిన పాఠశాలలు పున:ప్రారంభం
నవతెలంగాణ-విలేకరులు
వేసవి సెలవులు ముగించుకొని పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు వినూత్న రీతుల్లో స్వాగతాలు పలికారు. విద్యార్థులను పాఠశాలలో చేర్చేందుకు వచ్చిన తల్లిదండ్రులకు కూడా ఘన స్వాగతం పలికారు. ప్రారంభం రోజూ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ‘బడి బాట’ కార్యక్రమంలో భాగంగా ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేసి తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించడంతో ఈసారి అడ్మిషన్లు కూడా పెరిగాయి. గతంలో మూతపడిన పాఠశాలలను కూడా గురువారం పున:ప్రారంభించారు. అయితే, కొన్ని చోట్ల సరిపడా తరగతి గదులు లేక ఒకే గదిలో అన్ని తరగతుల పిల్లలు, చెట్ల కింద అంగన్వాడీ పిల్లలు కూర్చోవాల్సి వచ్చింది.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరసనగండ్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులను బ్యాండ్ మేళాలతో పూలు చల్లుకుంటూ స్వాగతం పలికారు. సిద్దిపేటలోని మెరిడియన్ పాఠశాలలో బెలూన్లు, రంగురంగుల పతాకాలు, కార్టూన్ పాత్రలతో కూడిన అలంకరణలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మిక్కీమౌస్, మినీ మౌస్ పాత్రలతో పిల్లలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో కలిసి ఆనందంగా పాల్గొన్నారు. చిన్నారుల కోసం ఆటలతో కూడిన ఏర్పాట్లు, ఫొటో బూత్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిద్దిపేట అర్బన్ మండలోని కేజీబీవీ హాస్టల్ను మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మనుచౌదరిలు సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాల గదులను ఉపాధ్యాయులు సుందరంగా అలంకరించారు. పాఠశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విద్యార్థులకు ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. పాఠశాల ముఖ ద్వారం వద్ద మామిడి తోరణాలు, బెలూన్లు, రంగురంగుల డెకరేషన్ కాగితాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు గులాబీ పూలు అందించి, చాక్లెట్లు ఇచ్చారు. శేరిలింగంపల్లి మండలం మదీనగూడ ప్రభుత్వ పాఠశాల, చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు.
ములుగు జిల్లా ఏటూర్నాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల భవనంలో విద్యార్థులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ముఖద్వారానికి మామిడి తోరణాలు, బెలూన్స్, కొబ్బరి, అరటి ఆకులతో అందంగా అలంకరించారు. నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులను, తల్లిదండ్రులను పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తోరణాలు కట్టి స్వాగతించారు. కొన్ని చోట్ల పువ్వులు ఇచ్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మెన్ సునిత విద్యార్థులకు, తల్లితండ్రులకు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు.
ఏండ్ల తరబడి మూతబడి.. పున:ప్రారంభమైన పాఠశాలలు
వివిధ కారణాలతో ఏండ్ల తరబడి మూతబడి ఉన్న పాఠశాలలు పాఠశాలల పున:ప్రారంభం రోజు తెరుచుకున్నాయి. ఉపాధ్యాయుల కొరతతో 12 ఏండ్ల కిందట మూతబడిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకట్రావ్పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం డీఈఓ శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. అడ్మిషన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రొఫెసర్ జయశంర్ బడిబాటలో భాగంగా 28 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారని డీఈఓ తెలిపారు. ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మూతపడిన పాఠశాలలను తెరిపిస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పాఠశాలకు రెగ్యులర్ పంపించాలన్నారు. ఈ సందర్భంగా హిందీ భాషా పండితుడు జి.శివరాం తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. కుమురంభీం-ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వల్లకొండ గ్రామంలోని పాఠశాల రెండేండ్ల కిందట మూతపడింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ ప్రాథమిక పాఠశాల పలు కారణాలతో మూతపడటంతో ఆ గ్రామంలోని పిల్లలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నామానగర్ గ్రామానికి వెళ్లి చదువు కొనసాగిస్తున్నారు. అయితే, బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు వల్లకొండ గ్రామానికి వెళ్లిన సమయంలో గ్రామస్తులు పాఠశాలను తిరిగి తెరిపించాలని కోరారు. ఫలితంగా ఆ పాఠశాలకు ఒక ఉపాధ్యాయున్ని సర్దుబాటు చేశారు. దీంతో గురువారం పాఠశాల పున:ప్రారంభమైంది. ఈ పాఠశాలను మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ప్రారంభించారు. మధ్యాహ్న భోజనం కూడా ప్రారంభించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యునిఫామ్స్ అందించారు. స్వగ్రామంలో పాఠశాల ఉంటే పిల్లలు చదువు పట్ల ఆసక్తి చూపుతారని, తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని ఎంఈఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏటుకూరి శ్రీనివాస్రావు, సృజన, ఆనందిత, జ్ఞానేశ్వర్, సీఆర్పి ఉమేష్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ మండలంలో ఐదు సంవత్సరాలు మూతపడి ఉన్న ఎంపీపీఎస్ రింగన్గూడ పాఠశాలను గ్రామ పటేల్ చిర్రకుంట ప్రధానోపాధ్యాయుడు జలపతితో కలిసి ప్రారంభించారు. సిర్పూర్(టి) మండలంలోని రావణ్పల్లి గామ్రంలో ఐదేండ్లుగా మూతపడిన ఎంపీపీఎస్ను ప్రారంభించారు. కౌటాల మండలంలోని పాత కన్నెపెల్లిలో గతంలో మూతపడిన ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ గావుడె హన్మంతు ప్రారంభించారు.
విద్యార్థులు లేక మూడు సంవత్సరాలుగా మూతపడిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ర్యాగట్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బడిబాట ద్వారా విద్యార్థులను చేర్పించి పున:ప్రారంభించారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓబులాపూర్ యుపిఎస్ పాఠశాల గత సంవత్సరం విద్యార్థులు లేని కారణంగా మూతపడింది. ఈసారి 11 మంది విద్యార్థులతో పాఠశాలను మళ్లీ ప్రారంభించినట్టు ఎంఈఓ లకావత్ రాజేష్కుమార్ తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం పాయపట్ల గ్రామంలో నాలుగు సంవత్సరాల నుంచి మూతపడిన ప్రాథమిక పాఠశాలను పునర్ ప్రారంభించినట్టు విద్యాశాఖ అధికారి తేజావత్ వెంకటేశ్వర్లు తెలిపారు.
చెట్ల కిందే విద్యార్థులు.. ఒకే గదిలో 5 తరగతులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో ఒకే తరగతి గదిలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకోవాల్సి ఉంది. అంగన్వాడీ విద్యార్థులు చెట్ల కిందే కూర్చుకుంటున్నారు. పదేండ్లుగా ఈ సమస్య ఉంది. దీంతో విద్యార్థుల హాజరు శాతం తక్కువ నమోదైంది. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలలో అదనపు గదులు, అంగన్వాడీ సెంటర్ నిర్మిస్తే తమ పిల్లలను పంపుతామని తల్లిదండ్రులు చెబుతున్నారు. దివిటిపల్లి గ్రామంలో పాఠశాలకు తరగతి గదులు లేవు. అంగన్వాడీ పిల్లలు చెట్ల కిందనే కూర్చుంటున్నారు.
విద్యార్థులకు ఘన స్వాగతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES