– అకాల వర్షాలతో కల్లాల్లో ఆగమాగం
– మార్కెట్లలో తడిసిన కాంటా వేసిన బస్తాలు
– వెంటాడుతున్న హమాలీలు, లారీల కొరత
– క్షేత్రస్థాయి పరిస్థితులు పట్టని అధికారగణం ొ రైతుల కన్నీరు
”పండించిన పంటను కొనేదిక్కులేదు. యాసంగిలో పదెకరాల్లో వరి వేసిన.. కోత కోసి ధాన్యాన్ని మార్కెట్లో పోసి 15 రోజులైంది. స్థలంలేక రోడ్డుపై వడ్లను ఆరబోసిన. 17 శాతం తేమ వచ్చేది. కాంటా వేసే సీరియల్ వచ్చే లోపు అకాల వర్షం పడి ధాన్యం తడిసింది. మళ్లీ నాలుగు రోజులు ఎండబెట్టినం.. బుధవారం వడ్లను కాంటా వేసిండ్రు. కానీ.. వెంటనే మిల్లుకు తరలించలేదు. ఇంతలోపే భారీ వర్షంతో బస్తాలన్నీ తడిశాయి. బస్తాల్లోని ధాన్యాన్ని మళ్లీ 17 శాతం తేమ వచ్చే వరకు ఆరబెట్టాలంట. దానికో వారం పట్టుద్ది. ఇంతలో మళ్లీ వర్షం పడితే మా బతుకేం కావాలి.” ఇదీ.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సరాఫ్పల్లికి చెందిన రైతు మల్లారెడ్డి కన్నీటి ఆవేదన.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడుస్తున్నాయి. మక్కలు ముక్కిపోతున్నాయి. రెండు వారాల్లో నైరుతీ వర్షాలు ఊపందుకోనున్నా ఇప్పటికీ ఏ ఊర్లో చూసినా రోడ్లు, మార్కెట్లలో ధాన్యం కుప్పలు పేరుకు పోయి ఉన్నాయి. మార్కెట్లకు తెచ్చిన ధాన్యంలో 45 నుంచి 50శాతం కూడా కొనుగోళ్లు చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన తర్వాత 15-20 రోజులు దాటనిదే కాంటా పడట్లేదు. హమాలీల కొరత ఉంది. ధాన్యాన్ని రవాణా చేసేందుకు లారీల్లేవు. మిల్లర్లు పెట్టే కొర్రీల వల్ల మిల్ పాయింట్ల వద్ద లోడుతో వచ్చిన లారీలు బారులు తీరుతున్నాయి. తక్షణమే హమాలీలు, లారీల కొరతను తీర్చడమే కాకుండా మిల్లర్లపై చర్యలు తీసుకోకపోతే జూన్ 15 వరకు కొనుగోళ్లు కొనసాగే ప్రమాదముంది.
15 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటకూర్, పుల్కట్, ఆందోల్, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల్లోని హైవే వెంట రైతులంతా రోడ్లపైనే ధాన్యం పోశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడటంతో వడ్లన్నీ వరద నీటితో కొట్టుకుపోయాయి. మరో హైవే వెంట కంది, సదాశివపేట, కొండాపూర్, కోహీర్, జహీరాబాద్ ప్రాంతంలోని రైతులూ రోడ్లపైనే పోశారు. మెదక్ జిల్లాలోనూ జోగిపేట-మెదక్, బొడ్మట్పల్లి-మెదక్, నర్సాపూర్-మెదక్, మెదక్-రామాయంపేట రోడ్లుపైనే అధికంగా ధాన్యం పోశారు. ధాన్యం రాసులన్నీ తడిశాయి. బురద నీటిలో వడ్లు కొట్టుకుపోవడంతో రైతులు నీళ్లల్లోంచి వడ్లను దేవుకోవాల్సి వచ్చింది.
మార్కెట్లో పోసిన ధాన్యం మ్యాచెర్ తీయడానికి రెండు వారాలు, మ్యాచర్ తీశాక కాంటా వేయడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. రైతులు మార్కెట్లలో 15 నుంచి 20 రోజుల వరకు పడిగాపులు కాస్తున్నారు. చౌటకూర్ మండలంలో 20 కొనుగోలు కేంద్రాలున్నాయి. కేంద్రాల్ని ప్రారంభించి 50 రోజులైనా సుల్తాన్పూర్ కేంద్రంలో బుధవారమే కొనుగోళ్లు ప్రారంభించారు. బద్రీగూడెం సెంటర్లో 2 వేల బస్తాలే కొన్నారు.. మరో ఐదు వేల బస్తాల ధాన్యముంది. ఉప్పరి గూడెంలోనూ 4 వేల సంచులే కొనగా, అక్కడా 60 శాతం నిల్వ ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మార్కెట్లకు వచ్చే ధాన్యమెంతో అంచనా ఉన్నప్పటికీ వేగవంతంగా కొనుగోళ్లు సాగేందుకు అవసరమైన లేబర్ను సమకూర్చకపోవడం వల్ల తీవ్రమైన నష్టం వాటిళ్లుతుంది. మరో పక్క ఆరబోసిన ధాన్యాన్ని మ్యాచర్ తీసి కాంటా వేస్తున్నారు. కానీ.. వెంటనే బస్తాలను మిల్లులకు తరలించడంలేదు. లారీ లోడు మిల్లుకు పోతే మిల్లర్లు దించుకోవట్లేదు. క్వింటాల్కు 15 కిలోలు తరుగు తీస్తేనే తప్ప దిగుమతి చేసుకోవట్లేదు. మిల్ పాయింట్ వద్ద లోడ్తో వచ్చిన లారీలు రెండు మూడు రోజులు బారులు తీరుతున్నాయి.
అకాల వర్షానికి ఉమ్మడి కరీం నగర్ జిల్లావ్యాప్తంగా ఆరబోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యా యి. పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్కు చెందిన రైతు సొల్లూరు రాజేందర్ 14 ఎకరాల్లో పండించిన సుమారు 400 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్ర యించేందుకు ఆరబోయగా సుమారు 100 క్వింటాళ్ల వరకు వర్షానికి కొట్టుకు పోయింది. ఇదే జిల్లా పెద్ద కల్వలకు చెందిన నర్ల శంకరయ్యకు చెందిన.. సుమారు 200 క్వింటాళ్ల ధాన్యం రాసిలో దాదాపు 20 క్వింటాళ్ల వరకు వరదపాలైంది. ఒక్కరోజే పెద్దపల్లిలో సుమారు 4వేల క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసి ముద్దయింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం మార్కెట్యార్డుల్లో ఈ నష్టం ఎక్కువగా ఉందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా సుమారు 2వేల క్వింటాళ్ల వరకు ధాన్యం కొట్టుకుపోయినట్టుగా అధికారులు చెప్పారు. ఈ జిల్లాలో 328 కొనుగోలు కేంద్రాల ద్వారా గురువారం నాటికి 2,39,996 మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించారు. సేకరణ లక్ష్యం 4.5లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 53శాతమే సేకరించగలిగారు.
తడిసిన ధాన్యం కొనాలి : మురళీగౌడ్, సరాఫ్పల్లి
ధాన్యం తెచ్చి 15 రోజులైంది. మ్యాచర్ వచ్చే వరకు ఎండబోశాం. కాంటా వేయలేదు. వర్షం పడి ధాన్యం తడవడంతో మళ్లీ ఆరపెట్టినం. తీరా కాంటా వేస్తరని చూస్తే సీరియల్ రాలేదన్నారు. ఇంతలో మూడోసారి వర్షమొచ్చి వడ్లు మొత్తం తడిశాయి. రెండె కరాల్లో వరి వేస్తే 8 ట్రాక్టర్ల ధాన్యమొచ్చింది. అమ్ముకో వడం కష్టంగా మారింది. తడిసిన ధాన్యాన్ని ఎంతకో కొంతకు కొనాలి. లేదంటే వడ్లను రోడ్లపైనే వదిలేసి పోవాల్సి వస్తది. వడ్లను ఆరబోయడం, కుప్పపోయడం వర్షానికి తడవగానే మళ్లీ ఆరబోయడం ఇదే పనైతుంది. అధికారులకు చెప్పినా గిదే పరిస్థితి ఉంది.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి : విద్యాసాగర్, సీపీఐ(ఎం), జోగిపేట ఏరియా కార్యదర్శి
వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోళ్లను వేగం చేయాలి. హమాలీలు, లారీల కొరతను తీర్చాలి. వర్షాలొస్తున్నందున టార్పాలిన్లు సరఫరా చేయాలి. కాంటా వేసిన వెనువెంటనే రవాణా చేయాలి. ఆందోల్ మండలంలో వర్షాలకు తడిసిన ధాన్యం కేంద్రాల్ని పరిశీలించాం. ధాన్యం కుప్పలన్నీ వర్షం నీటిలో తడిశాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
యాసంగీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 59.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సుమారు కోటీ 30 లక్షల టన్నుల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని వ్యవ సాయ శాఖ అంచనా వేసింది. ఇందులో విక్రయాల కోసం 70 లక్షల టన్నుల వరకు మార్కెట్లకు వచ్చే అవకాశముందని అంచనా వేసి అందు కోసం ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 8245 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 56 శాతం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మిగతా ధాన్యం మార్కెట్టలోనే మగ్గుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా కు సంబంధించి మెదక్ జిల్లాలో 498 కొనుగోలు కేంద్రాల్లో 3.89 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 1.75841 మెట్రిక్ టన్నులే కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
తడిసిన వడ్లు.. ముక్కిన మక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES