కరాచీ: పహల్గాం దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. గత రాత్రి తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. దీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసునన్నారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. ”మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్) అనుకుంటున్నారని, కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్తాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆస్పత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది. ఇక భారత్ జరిపిన దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, 46 మందికి గాయాలయ్యాయని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్పై పాక్ ప్రధాని ఏమన్నారంటే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES