Friday, June 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికెనడా జి7 సాధించిందేమిటి?

కెనడా జి7 సాధించిందేమిటి?

- Advertisement -

ప్రపంచ మార్కెట్లను పంచుకొనేందుకు ఏర్పడిన గుంటనక్కల కూటమే జి-7 అంటే కొంత అతిశయోక్తి అనిపించవచ్చుగానీ అది నిజం. దానిలో ఉన్న అమెరికా, జర్మనీ, జపాన్‌, బ్రిటన్‌, కెనడా, ఇటలీ, ఫ్రాన్సు అన్నీ ధనిక దేశాలే. నయావలసవాదంలో భాగంగా పేద, వర్ధమాన దేశాల్లో తమ ఉత్పత్తులు, సేవలు, ఆయుధాలను అమ్ముకు నేందుకు అవసరమైన విధానాలను రూపొందించేందుకు, వాటిని ప్రపంచ సంస్థల ద్వారా అమలు చేయించేందుకు దశాబ్దాల తరబడి అవి చేయని యత్నాలు లేవు. సోవియట్‌ నుంచి విడిపోయిన తర్వాత రష్యా ఎక్కడ తమకు పోటీకి వస్తుందో అని ఆలోచించి, దాన్ని కూడా చేర్చుకొని ఎదురులేకుండా చూసుకోవాలని ప్రయత్నించి కొంతకాలం జి-8గా పనిచేశాయి. తర్వాత విబేధాలతో దాన్ని బయటకు నెట్టాయి. తాజాగా కెనడాలో జరిగిన ఆ కూటమి 51వ సమావేశాలు చివరికి ఒక ప్రకటన కూడా విడుదల చేయలేకపోయాయంటే అది ఒక విఫల సభ అని వేరే చెప్పనవసరం లేదు. ఇంతకంటే నాకు వేరే ముఖ్యమైన పనులున్నా యంటూ ట్రంప్‌ సమావేశాల మధ్యలోనే స్వదేశం వెళ్లాడంటేనే దాని తీరుతెన్నులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పాటు ఈ కూటమి సభ్య రాజ్యాల మీద కూడా ప్రతికూల పన్నుల యుద్ధం ప్రకటించిన ట్రంప్‌ ఏ ముఖం పెట్టుకుని ఆయాదేశాల నేతలతో మనసు విప్పి మాట్లాడగలడు?
పెళ్లికొడుకు లేక , పెళ్లికూతురు లేక, తర్వాత పెళ్లేముంటుంది. వంటకాలు వృథా గాకుండా విందు భోజనాలు చేసి రావటం తప్ప వేరే పనేముంటుంది. అదే కెనడాలో జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతివ్వటంలో ఈ కూటమి దేశాలన్నీ గతంలో ఒకేమాట మీద ఉన్నాయి. ఇప్పుడు దాని మీద తీర్మానం చేయకూడదు, కొత్త ఆంక్షల గురించి మాట్లాడకూడదు, రష్యాను గట్టిగా ఏమీ అనకూడదని తెగేసి చెప్పిన ట్రంప్‌ వాషింగ్టన్‌ వెళ్లిపోయాక ఆరు దేశాల నేతలూ తలలు పట్టుకుని మాట్లాడుకోవటం తప్ప చేసిందేమీ లేదు. అమెరికా వైఖరితో కనీసం ప్రతిపాదిత తీర్మాన పత్రాలను కూడా పంపిణీ చేయకుండా చెత్తబుట్టలో పడవేశారు. క్రిమియాను విలీనం చేసుకున్న తర్వాత కూటమి నుంచి రష్యాను బహిష్కరించకుండా ఉండిఉంటే అసలు ఉక్రెయిన్‌ పోరు జరిగేదే కాదని ట్రంప్‌ అన్నాడు. ఏదో జరుగుతుందని వస్తే కనీసం ప్రకటన కూడా లేకపోయిన తర్వాత తాను మాత్రం ఉండి పొడిచేదేముందని ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ కూడా చివరి వరకూ ఉండకుండా జారుకున్నాడు. తీర్మానం చేయకపోయినా మేమంతా మీవెంటే ఉంటామని మిగతా దేశాల నేతలు చెప్పి ఓదార్చారట. ఉక్రెయిన్‌ మీద మాట్లాడలేదు గానీ మధ్య ప్రాచ్యానికి ముప్పు వచ్చిందనే పేరుతో ఇరాన్‌ మీద ఇజ్రాయిల్‌ జరిపిన దాడిని పూర్తిగా సమావేశం సమర్ధించింది. ఇరాన్‌ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదని ప్రకటించింది. ఈ సమావేశంలో ఇంక పర్యావరణ, ఉపాధి, కృత్రిమ మేధ, విలువైన ఖనిజాల వంటి వాటి గురించి ఎన్ని మాట్లాడుకున్నా గాలిని కోసినట్టే.
అలాంటి సమావేశానికి మిగతావారితో పాటు ఆహ్వానం రాకపోతే గిలగిల్లాడిపోయిన మన ప్రధాని నరేంద్రమోడీకి చివరిక్షణంలో పిలుపు రాగానే పదకొండువేల కిలోమీటర్లు ప్రయాణించి ఒక తోడుపెళ్లికొడుకులా కూర్చొని బులబాటం తీర్చుకున్నారు. ఏమి సాధించారయ్యా అంటే కెనడాతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి నెలకొల్పు కున్నారు.ఆ మాత్రం దానికి ఆయాసపడి అంతదూరం వెళ్లటం అవసరమా? హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అనే ఖలీస్తానీవాది హత్యలో భారత్‌ హస్తం ఉందన్న కెనడా ఆరోపణలో గానీ, ఖలీస్తానీ తీవ్రవాదులకు ఆశ్రయంలో గానీ ఎలాంటి మార్పు లేదు. అలాంటపుడు 2023లో కెనడాతో ఎందుకు సంబంధాలు తెంచుకున్నట్టు? ఇప్పుడు ఏమి సాధించి తిరిగి నెలకొల్పు కున్నట్టు? నిజ్జర్‌ హత్య కారణంగానే జి7 సమావేశాలకు అందరితో పాటు ఆహ్వానించకుండా చివరిలో రమ్మని పిలిచి అవమానించిన తీరు వ్యక్తిగా నరేంద్రమోడీకంటే దేశ ప్రధానికి జరిగినదిగా భావించాలి. పోనీ ఇంతా చేస్తే అక్కడ పహల్గాం దాడికి కారణమైన పాకిస్తాన్‌ను ఖండించే తీర్మానం ఏమైనా చేయించారా అంటే అదీ లేదు. మన పార్లమెంటరీ బృందాలు వెళ్లిన చోటల్లా పాక్‌ దురాగతాలను ఆయాదేశాలకు వివరించాయి. ఉగ్రవాదం పట్ల ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పారు. ఆ మాత్రం దానికి ఇన్ని రోజుల తర్వాత ఆక్కడికి వెళ్లి చెప్పాలా! ప్రతి పైసాకు జవాబుదారినని చెప్పుకున్న నరేంద్రమోడీ కోట్ల రూపాయల జనం సొమ్ముతో ఇలాంటి సమావేశాలకు వెళ్లటం అవసరమా?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -