ఉమ్మడి ఏపీలో చివరగా 2011లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోసుల్ని భర్తీ చేశారు. వారంతా ప్రస్తుతం ప్రమోషన్లు పొంది ఉన్నత హోదాలో ఉన్నారు. వారిలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్గా పనిచేస్తున్న జి.రమేష్, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా కొనసాగుతున్న జి.ఉషారాణి, ఇతర ఉన్నత హోదాలో సోమిరెడ్డి, ఎ సుబ్బారెడ్డి తదితరులను ఈ సందర్భంగా ఉటంకించవచ్చు. వీరంతా అప్పటి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలోకి వచ్చినవారే. అప్పటినుండి ఇప్పటివరకు ఆ పోస్టులు మళ్లీ భర్తీకి నోచుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లందరూ ఇన్ఛార్జిలే కావడం గమనార్హం. 612 మండలాల్లో 90 నుంచి 95 శాతం వరకు ఆయా మండలాల్లోని సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖకు ఇన్చార్జులుగా విధులు నిర్వహిస్తున్నారు. వారంతా ఒకపక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూ అదనంగా మండల విద్యాశాఖ అధికారులుగా కొనసాగుతున్నారు. వీరే కాకుండా 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇన్ఛార్జిలే ఉండటం వల్ల పర్యవేక్షణ పడకేసిందని చెప్పవచ్చు.
ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునికి మండల విద్యాధికారిగా ఇన్ఛార్జి బాధ్యతలను ఇవ్వడం వల్ల తన బడికి హెడ్మాస్టర్ గానే కాకుండా తరగతి బోధకుడిగా, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా, పిఎం శ్రీ నోడల్ అధికారిగా ఇలా బహుళ పాత్రలను పోషించాల్సిన పరిస్థితి వస్తున్నది. దీంతో సొంత పాఠశాల పర్యవేక్షణ గాల్లో దీపంగా మారింది. ఫలితంగా ఉపాధ్యాయుల పనితీరు, బోధన, హాజరు, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు తదితర అంశాలను పర్యవేక్షించే తీరికే లేకుండా పోతుంది. అలాగే ఒక జిల్లా విద్యాధికారి రెండు, మూడేసి జిల్లాలకు అధికారికి కొనసాగుతుండడం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నామని, అదే విధంగా తన మాతృసంస్థలకు కూడా సరైన న్యాయాన్ని చేకూర్చలేకపోతున్నామని వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాధికారుల కింద ఉన్న డిప్యూటీ ఎడ్యూకేషనల్ ఆఫీసర్లు కూడా ఇన్ఛార్జిలే కావడం వల్ల పర్యవేక్షణ చేయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
గత విద్యా సంవత్సరం సుమారు పదకొండు వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడంతో పాటు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులను కూడా చేపట్టడంతో కొంతమేర విద్యాబోధన గాడిలో పడినట్లయింది. బోధనా నైపుణ్యాల పెంపు కోసం ఎస్సీఈఆర్టీ ఉపాధ్యా యులకు వేసవి సెలవులలోనే వఅత్యంతర శిక్షణను సైతం అందించింది. అయితే కేవలం బోధనా నైపుణ్యాలను పెంచడం ద్వారా మాత్రమే సత్ఫలితాలను ఆశించలేమని నిరంతరం పటిష్ట పర్యవేక్షణ కూడా అవసరమని విద్యా నిపుణుల అభిప్రాయం. కానీ ఇన్ఛార్జి పర్యవేక్షణాధికారుల ద్వారా అనుకున్న ఫలితాలు రాబట్టలేమనే వాదన కూడా ఉంది. కొత్త నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చు. ఆ భర్తీ ప్రక్రియలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉండి, బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు కొంత వెయిటేజ్ ఇవ్వడం బాగుంటుంది. ఖాళీగా ఉన్న మండల విద్యాధికారుల పోస్టులను కూడా భర్తీ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయవచ్చు.
ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షణపై కేంద్రీకరణ పెరుగుతుంది. మండల స్థాయిలో ఎంఈఓ పాత్ర పోషిస్తున్న సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల స్థానంలో రెగ్యులర్ ఎంఈఓ ల నియామకం ద్వారా మరింత పర్యవేక్షణను పెంచవచ్చు. తద్వారా ఇప్పుడున్న ఇన్ఛార్జిల మీద పని భారం తగ్గుతుంది. అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని విద్యాశాఖకు బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయింపు చేయడం ద్వారా మౌలిక వసతులను కూడా కల్పించవచ్చు. కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు విద్యకు బడ్జెట్లో 30 శాతం కేటాయింపులు చేయాలి. కనీసం 20 శాతం అయినా కేటాయింపులు చేయడం ద్వారా విద్యా కమిషన్ సూచనలకు సార్థకత లభిస్తుంది. ఇటు నిధుల కేటాయింపు ద్వారా విద్యా వ్యవస్థ పరిపుష్టికి దారి ఏర్పడు తుంది. అటు ఖాళీల భర్తీ ద్వారా పర్యవేక్షణా ధికారుల నియామకం వల్ల పర్యవేక్షణ పటిష్టంగా నిర్వహించబడుతుంది. తద్వారా విద్యా వ్యవస్థ తప్పక గాడిన పడే అవకాశముంది.ఆ దిశగా సర్కార్ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.
– భాస్కర్ యలకంటి, 8919464488
విద్యపై పర్యవేక్షణేదీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES