నవతెలంగాణ-హైదరాబాద్: ఆరావళి పర్వతాలు దేశ సహజ వారసత్వాన్ని, గొప్ప పర్యావరణ విలువలను కలిగి ఉన్నాయి అని మంగళవారం కాంగ్రెస్ పేర్కొంది. ఈ పర్వత శ్రేణి ఎత్తును పునర్నిర్వచించడంలో మోడీ ప్రభుత్వం ఆంతర్యం ఏమిటి? ఎవరి ప్రయోజనాల కోసం అని కాంగ్రెస్ నిలదీసింది. తాజాగా పర్యావరణ, అటవీ శాఖా మంత్రి ఆరావళి పర్వతాల ఎత్తుకు సంబంధించి ఇచ్చిన స్పష్టతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో సందేహం వ్యక్తం చేశారు.
ఆరావళి మన సహజ వారసత్వంలో భాగం. గొప్ప పర్యావరణ విలువలను కలిగి ఉంది. వాటికి గణనీయమైన పునరుద్ధరణ, అర్థవంతమైన రక్షణ అవసరం. మోడీ ప్రభుతవం వాటిని ఎందుకు పునర్నిర్వచించాలని నిశ్చయించుకుంది? దేని కోసం? ఎవరి ప్రయోజనం కోసం? అని జైరాం రమేష్ ఎక్స్ పోస్టులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వంటి ప్రొఫెషనల్ సంస్థ సిఫార్సులను ఉద్దేశపూర్వకంగా ఎందుకు విస్మరించి.. వాటిని పక్కనపెడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఆరావళిపై కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రి ఇటీవల ఇచ్చిన స్పష్టతలు మరిన్ని ప్రశ్నలు, సందేహాలను లేవనెతుత్తున్నాయి.
పర్యావరణ శాఖా మంత్రి ఆరావళిలోని 1.44 లక్షల చదరపు కిలోమీటర్లలో 0.19 శాతం మాత్రమే ప్రస్తుతం మైనింగ్ లీజుల కింద ఉందని కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భూపేందర్ యాదవ్ చెబుతున్నారు. అయితే ఈ మైనింగ్ లీజు ఇప్పటికే 68 వేల ఎకరాలు, విస్తారమైన విస్తీర్ణంలో ఉంది. అయితే ఆరావళి 1.44 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అని చెప్పడం మోసపూరితమైనది. ఆరావళి 34 జిల్లాల మొత్తం భూభాగాన్ని విస్తరించి ఉంది. కేంద్రం చెబుతున్న ఈ సంఖ్య పూర్తిగా తప్పు. ఎందుకంటే వాస్తవానికి ఈ జిల్లాల్లోని ప్రాంతం ఆరావళి కిందే ఉంది.
ఈ ఆరావళి భూభాగంలో కేవలం 0.19 శాతమే మైనింగ్ లీజుల కింద ఉన్నది తక్కువ అంచనా. 34 జిల్లాలకు సంబంధించిన డేటాను ధృవీకరిస్తే వాటిల్లో 15 జిల్లాల్లో ఆరావళి కింద ప్రాంతం మొత్తం భూభాగంలో 33 శాతం మైనింగ్ జరుగుతుంది. అయితే మోడీ ప్రభుత్వం చెబుతున్న నిర్వచనం ప్రకారం.. ఈ ఆరావళి ప్రాంతాలలో ఎంత భూభాగాన్ని మినహాయించి మైనింగ్, ఇతర అభివృద్ధికి అందుబాటులో ఉంచుతారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు అని జైరాం రమేష్ ఎత్తిచూపారు.
పర్యావరణ శాఖామంత్రి చెప్పినట్టుగా 500 మీటర్ల ఎత్తైన కొండలకు రక్షణ ఉంటుంది. వంద మీటర్ల ఎత్తైన కొండలకు రక్షణ ఉండదు అనేది స్పష్టమవుతుంది. అయితే కేంద్రం సవరించిన నిర్వచనంతో ఢిల్లీ ఎన్సిఆర్ (రాజధాని ప్రాంతంలో)లోని ఆరావళి పర్వతాల కింద ఉన్న చాలా కొండ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధి స్థలాలుగా మారుతాయి. దీంతో పర్యావరణ సమస్యలు మరింత పెరుగుతాయి అని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
సరిస్కా టైగర్ రిజర్వ్ సరిహద్దులను మైనింగ్ అనుమతించే దిశగా.. దాన్ని పునర్నిర్వచించే చర్యకు కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆరావళి. అసలు పర్యావరణ వ్యవస్థ విచ్ఛిన్నమైతే.. పర్యావరణమే దెబ్బతింటుందనే విషయాన్ని పర్యావరణ మంత్రి విస్మరిస్తున్నారు. ఇతర చోట్ల ఇలాంటి విచ్ఛన్నమే జరగడం వల్ల వినాశనానికి కారణమవుతోంది అని జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.



