– మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వకపోవడం దుర్మార్గం
– రాజ్యాంగం, హిందూ ధర్మాన్ని కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం
– బీజేపీ నాయకులు రామాయణం చదవాలి
– రావణుడికి రాముడు ఎలా అంత్యక్రియలు నిర్వహించాడో తెలుసుకోవాలి
– మావోయిస్టులపై హత్యాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి
– ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి.. కేంద్రం శాంతిచర్చలు జరపాలి
– విలేకర్ల సమావేశంలో వామపక్ష, శాంతి సమన్వయ కమిటీ నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా మరో ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అత్యంత పాశవిక చర్య అనీ, దుర్మార్గమని వామపక్ష పార్టీలు, శాంతి సమన్వయ కమిటీ నేతలు విమర్శించారు. హిందూ ధర్మాన్ని నమ్మే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు మృతదేహాలను గౌరవించడం తెలియదా?అని ప్రశ్నించారు. ఏ ధర్మం ప్రకారం ఆ మృతదేహాలను దహనం చేశారని అడిగారు. మనుషులను చంపేసే హక్కు ఎవరిచ్చారనీ, ఏ ధర్మం చెప్పిందని అన్నారు. మావోయిస్టులపై పోలీసులు జరిపిన హత్యాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం పాకిస్తాన్తో చర్చలు జరిపే కేంద్రప్రభుత్వం భారత పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వ్యక్తులను చంపినంత మాత్రాన ఆ భావాలను పోగొట ్టలేరని అన్నారు. మావోయిస్టులంటేనే భయపడే మోడీ, షా చివరికి వారి శవాలకూ వణికిపోతు న్నారని చెప్పారు. నిత్యం రాముడి జపం చేసే బీజేపీ నాయకులు రామాయణం చదవాలని సూచించారు. రావణుడు చనిపోతే పద్ధతి ప్రకారం దహన కార్యక్రమాలను రాముడు ఎలా నిర్వహించాడో తెలుసుకోవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపా లని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశాన్ని వామపక్ష పార్టీలు, శాంతి సమన్వయ కమిటీ నాయకులు నిర్వహించారు.
అమిత్షాను అరెస్టు చేయాలి : జాన్వెస్లీ
2026, మార్చి నాటికి దేశంలో మావోయి స్టులు లేకుండా చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటించారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి జాన్వెస్లీ గుర్తుచేశారు. అంటే మావోయిస్టు లను చంపేస్తామన్నారని చెప్పారు. మనుషులను చంపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మావో యిస్టులను చంపుతామంటూ బహిరంగంగా ప్రక టించిన అమిత్షాను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అనాగరిక, ఆటవిక పాలన కొనసాగుతున్నదని విమర్శిం చారు. మావోయిస్టుల శవాల ముందు కేంద్ర బలగాలు నృత్యం చేయడం ఏమిటనీ, దాన్ని మోడీ, షా అభి నందించడం ఎంతవరకు సమం జసమని ప్రశ్నిం చారు. వారిని ప్రశ్నించినా, నచ్చకపోయినా ఎవరినైనా చంపేస్తారా?అని అడిగారు. నరహం తక పాలన సాగిస్తామంటే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. హిట్లర్నే అణచివేసిన చరిత్ర ఉందన్నారు.
శవయాత్రకు ప్రజలు వస్తారన్న భయం : హరగోపాల్
మావోయిస్టుల మృతదేహాలను కుటుంబా లకు అప్పగిస్తే శవయాత్రకు ప్రజలు ఎక్కువ మంది వస్తారన్న భయం కేంద్ర ప్రభుత్వానికి ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. అయితే వారి మృతదేహాలను ఏ పద్ధతి ప్రకారం దహనం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతు ఎందుకుందో, ఎక్కువ మంది ఎందుకు వస్తారో ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో అనేక యుద్ధాలు జరిగాయనీ, అనేక మంది చనిపోయా రనీ, కానీ శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయా లకు పాల్పడిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. రామ భక్తులమనీ, రామమందిరం కట్టించామనీ చెప్పే బీజేపీ నాయకులకు అసలు రామాయణం తెలుసా?అని ప్రశ్నించారు. వాల్మీకి రామాయణం చదవాలని సూచించారు. సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ అధికార ప్రతినిధి జెవి చలపతిరావు, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యు లు వనం సుధాకర్, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్య దర్శి రమేష్రాజా, ఎస్యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మురహరి, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ మాట్లాడుతూ కేంద్రంలో అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పౌర సమాజం సంఘటి తం కావాలని కోరారు. అటవీ సంపదను కార్పొ రేట్ శక్తులకు దోచిపెట్టడం కోసం మావోయిస్టు లతోపాటు ఆదివాసీలను లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న నరమేధాన్ని ఆపాలనీ, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
మృతదేహాలను అప్పగించకపోవడం అమానవీయం : కూనంనేని
ఎన్కౌంటర్లో హత్య చేసిన మావో యిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే దహనం చేయ డం అమానవీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు భారత ప్రధాని మోడీ లొంగిపోయి పాకి స్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకు న్నారని చెప్పారు. వంద మంది ఉగ్రవాదులను కూడా చంపలేదనీ, కానీ 800 మంది మావో యిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. నంబాల కేశవ రావు ముఖంపై తుపాకితో గుద్దిగుద్ది చంపడం ఏమిటనీ, మావోయిస్టులు ఏం ద్రోహం చేశా రని ప్రశ్నించారు. మావోయిస్టులను చంపి మోడీ, షా సంబురాలు చేసుకోవడం సరైంది కాదనీ, వారికి మానవత్వం ఉందా?అని అడి గారు. ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో పర్యావరణ శాఖ మూడు లక్షల చెట్ల నరికివేతకు అనుమతిచ్చిం దనీ, ఈ ఎన్కౌంటర్లు అటవీ సంపదను కార్పొ రేట్లకు అప్పగించేందుకేనని విమర్శించారు.