– మోడీవి మోసపు హామీలు.. అమలు కాని పథకాలు
– 11 ఏండ్ల పాలనలో అంతా దగా..
– ఆర్ఎస్ఎస్ విధానాలపై దేశవ్యాప్త ఉద్యమం : ఎన్పీఆర్డీ సదస్సులో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘మోడీజీ..మీరన్న అచ్చేదిన్ వికలాంగులకా? కార్పొరేట్లకా? స్పష్టపర్చండి’ అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రలో .. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ అధ్యక్షతన’పదకొండేండ్ల బీజేపీ పాలన.. వికలాంగుల పై ప్రభావం’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ మోసపు హామీలు, అమలు కానీ పథకాలతో వికలాంగులను ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. పదకొండేండ్ల పాలనలో అదానీ, అంబానీలాంటి గుత్త పెట్టుబడి దారుల ప్రయోజనాలు కాపాడటం తప్ప.. వికలాంగుల సంక్షేమానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. 2014 ఎన్నికల కంటే ముందు వికలాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాల న్నారు. పదకొండేండ్లలో వికలాంగుల్లో పేదరికం, నిరుద్యోగం, ఆకలిచావులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు, 2020లో విధించిన లాక్ డౌన్ వారి జీవితాలను అతలా కుతలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసమే ఉన్నామని గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో వికలాంగులకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల్లో సగం మందికి కూడా యూడీఐడీ కార్డులు రాలేదని చెప్పారు. ఎన్నో పోరాటాల ద్వారా వచ్చిన 2016 ఆర్పీడబ్ల్యూడీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటి వరకు వికలాంగుల కోసం స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేయలేదని చెప్పారు. న్యాయబద్ధమైన వివక్ష ఎదుర్కోవచ్చని చట్టంలో పొందుపర్చటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వికలాంగుల కోసం అమలవుతున్న కేంద్ర ప్రభుత్వపథకాలకు నిధుల కోత పెడుతున్నా రని చెప్పారు. సుగమ్య భారత్ అభియాన్ పథకం మోడీ ప్రచారం కోసమే తప్ప వికలాంగుల కోసం కాదన్నారు. అమృతభారత్ రైల్వే స్టేషన్లలో ఎందుకు అవరోధ రహిత వాతావరణం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2020 నూతన విద్యా పథకం వికలాంగులను చదువులకు దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగుల్లో 65 శాతం మందికి ఉపాధి లేదని చెప్పారు. 2012 నుండి ఇందిరా గాంధీ నేషనల్ వికలాంగుల పెన్షన్ రూ. 300 ఇస్తున్నారనీ, ధరల పెరుగుదల సూచికి అనుగుణం గా పెన్షన్ పెంచటంలో ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఎలాంటి షరతులు లేకుండా ఇందిరా గాంధీ నేషనల్ వికలాంగుల పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టంలో వికలాంగులకు జాబ్ కార్డులివ్వ కుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని తెలిపారు. 2016 ఆర్పీడబ్ల్యూడి చట్టం, నేషనల్ ట్రస్ట్ లకు చైర్మెన్లను నియమించడం లేదని చెప్పారు. రిహాబిలిటేషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా చట్టానికి చైర్మెన్ను నియమించకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నా రని నిలదీశారు. దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది నేషనల్ ఇన్స్టిట్యూట్లను విలీనం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే స్టాన్ స్వామి, సాయిబాబా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎం అడివయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకిచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. పెన్షన్ పెంచకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల కార్పొరేషన్ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పెన్షన్లు మంజూరు చేయాలనీ, 2016 ఆర్పీ డబ్ల్యూడీ చట్టం ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు జె రాజు, యశోద, కాశప్ప, గంగాధర్, ఉపేందర్, లింగన్న, స్వామి, అరీఫా తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకేది అచ్చేదిన్?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES