Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక ఎన్నికలు ఎప్పుడు?

స్థానిక ఎన్నికలు ఎప్పుడు?

- Advertisement -

– ఓటమి భయంలో రేవంత్‌ సర్కార్‌ : బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఆరోపించారు. శనివారంనాడిక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12,769 మంది సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసిందనీ, 5,717 మంది ఎంపీటీసీల పదవీకాలం 2024 మే నెలలో ముగిసిందని తెలిపారు. 538 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్ల పదవీకాలం పూర్తయ్యి ఏడాది దాటిపోయిందన్నారు. రాష్ట్రంలోని మొత్తం 130 మున్సిపాల్టీల్లో 128 మున్సిపాల్టీల పదవీకాలం పూర్తయ్యి 6 నెలలు గడిచినా, ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదని విమర్శించారు. భారత రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆధీనంలో ఉన్నాయనీ, వాటిని సకాలంలో నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని వివరించారు. ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల స్థానిక సంస్థలకు సెంట్రల్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా రావల్సిన అభివృద్ధి నిధులు నిలిచిపోతాయనీ, ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావల్సిన రూ.1,514 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రావల్సిన రూ.800 కోట్ల బకాయిలు ఆగిపోయాయని తెలిపారు. పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని విమర్శించారు. స్థానిక సమరంలో కాంగ్రెస్‌పార్టీ ఓటమి పాలవుతుందన్న భయంతోనే ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -