Wednesday, February 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్..

 భారత్-అమెరికా డీల్‌పై మాట మార్చిన వైట్‌హౌస్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై విడుదల చేసిన అధికారిక ఫ్యాక్ట్‌షీట్‌లో వైట్‌హౌస్ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది. ఒప్పంద వివరాలు వెల్లడించిన కొన్ని రోజులకే ఈ సవరణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, భారత్ కొనుగోళ్లకు సంబంధించిన పదజాలాన్ని మార్చడంతో పాటు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, డిజిటల్ పన్నుల ప్రస్తావనను తొలగించింది.

తొలుత విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో, అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ “నిబద్ధతతో ఉంది” అని పేర్కొన్నారు. అయితే, సవరించిన వెర్షన్‌లో ఈ పదాన్ని “కొనుగోలు చేయాలని భావిస్తోంది” అని మార్చారు. ఒప్పందంపై భారత్ వైపు నుంచి ఉన్న కట్టుబాటు తీవ్రతను ఈ మార్పు తగ్గించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దీంతో పాటు, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారత్ సుంకాలు తగ్గిస్తుందన్న జాబితా నుంచి “కొన్ని రకాల పప్పుధాన్యాలు” అనే పదాన్ని తొలగించారు. ఇది భారత రైతులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అదేవిధంగా, భారత్ తన డిజిటల్ సేవల పన్నును తొలగిస్తుందన్న వాక్యాన్ని కూడా ఫ్యాక్ట్‌షీట్ నుంచి పూర్తిగా తొలగించడం గమనార్హం.

ఈ మార్పులను వైట్‌హౌస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్రకటన లేకుండా చేసింది. ఈ సవరణలకు గల కారణాలపై అమెరికా ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. దీంతో ఒప్పందంలోని అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన విషయంలో స్పష్టత లోపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -