నవతెలంగాణ-హైదరాబాద్: భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని నివారించేందుకు ప్రపంచవ్యాప్త ఒప్పందాన్ని ఆమోదించాలని పిలుపునిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా సభ్యులంతా ఓటు వేశారు. ఈ తీర్మానంపై నేడు (మే 20) జరిగే పూర్తి ప్లీనరీలో చర్చ జరిగింది. అనంతరం వివిధ దేశాల అధ్యక్షులతో కూడిన ఉన్నతస్థాయి విభాగం సమావేశంలో వెల్లడించనున్నట్లు డబ్ల్యుహెచ్ఒ ఒక ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన మూడేళ్ల ప్రాతిపదికను అనుసరించి ఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. కొవిడ్ సమయంలో మహమ్మారిని నివారించడం, సిద్ధం చేయడం వాటికి ప్రతిస్పందించడంలో ఉన్న అంతరాలు మరియు అసమానతలను పరిష్కరించడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఒప్పందంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఒప్పందాన్ని డబ్ల్యుహెచ్ఒ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ఆమోదించింది. ప్రపంచ దేశాలు, డబ్ల్యుహెచ్ఒ వంటి అంతర్జాతీయ సంస్థలు, పౌరసమాజం, ప్రైవేట్ రంగం, ఇతర భాగస్వామ్యాల మధ్య బలమైన సహకారం, సమన్వయాన్ని పెంపొందించడం ద్వారా మహమ్మారిని నివారించడం, భవిష్యత్తులో మహమ్మారి సంక్షోభ సంభవించినపుడు మెరుగ్గా స్పందించడం లక్ష్యంగా పెట్టుకుందని డబ్ల్యుహెచ్ఒ ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ తర్వాత భవిష్యత్తులో వచ్చే మహమ్మారి నుండి ప్రపంచాన్ని రక్షించేందుకు కలిసిరావాలని నిర్ణయించుకున్న సభ్యదేశాలను డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభినందించారు.