Friday, June 6, 2025
E-PAPER
Homeజాతీయంఎందుకిలా..?

ఎందుకిలా..?

- Advertisement -

– సమాచార లోపం.. ప్రణాళిక లేని వైనం
– ట్రాఫిక్‌, క్రికెట్‌ అసోసియేషన్‌, ప్రభుత్వాధికారుల మధ్య సమన్వయం కరువు
– చిన్నస్వామి స్టేడియంలో కొన్ని ప్రవేశద్వారాలు మాత్రమే ఓపెన్‌
– ఎటు నుంచి వెళ్లాలో తెలియక అభిమానుల్లో తీవ్ర గందరగోళం
– ‘బెంగళూరు’ తొక్కిసలాటకు పలు కారణాలు
కర్నాటకలోని బెంగళూరులో తొక్కిసలాట ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) విజయోత్సవ వేడుకల్లో భాగంగా 11 మంది మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. అయితే, సమాచార లోపం, సరైన ప్రణాళిక లేకపోవటం, ట్రాఫిక్‌, క్రికెట్‌ అసోసియేషన్‌, ప్రభుత్వాధికారుల మధ్య సమన్వయం లేకపోవటంతో పాటు పలు అంశాలూ ఈ ప్రమాదానికి కారణాలుగా మారాయని తెలుస్తున్నది.
బెంగళూరు:
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. 18 ఏండ్ల తర్వాత ఆర్‌సీబీ ఐపీఎల్‌ ట్రోఫీని గెలవటంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ టీమ్‌ను సన్మానించే కార్యక్రమం జరిగింది. అయితే, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చిన కారణంగా, పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. 30 వేల మంది మాత్రమే పట్టే స్టేడియానికి.. రెండు లక్షల మందికి పైగా తరలి వచ్చినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు అధికారులు చెప్తున్నారు. అయితే, ఈ ఉదంతానికి పలు కారణాలున్నాయని వార్త కథనాలు, అక్కడి పరిస్థితులను బట్టి కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.
సన్మాన కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రణాళిక లేదు. అధికారుల్లో సమన్వయం లోపించింది. విజయోత్సవ ర్యాలీకి అనుమతివ్వటంలో అనిశ్చితి, ఉచిత పాస్‌ల పుకార్లూ తొక్కిసలాట ఘటన జరగటానికి కారణాలయ్యాయి. విధాన సౌధలో జట్టును సత్కరించిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. స్టేడియం వెలుపల గుమిగూడిన జనసమూహాన్ని అంచనా వేయటంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన ఒకింత అసహనం, ఆగ్రహానికి గురయ్యారు.
ర్యాలీపై అనిశ్చితి
అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్‌ ఫైనల్‌లో ఆర్‌సీబీ ట్రోఫీని గెలిచిన బెంగళూరులో ఓపెన్‌ బస్సులో విజయ ర్యాలీని ఆర్‌సీబీ టీం కోరుకున్నది. ఇందుకు మౌఖిక అనుమతి లభించింది. అయితే, ఈ ర్యాలీకి లక్షలాది మంది హాజరవుతారనీ, వారిని నియంత్రించటానికి ఒక ప్లాన్‌ అవసరమని ఎవరూ ఊహించలేదు. ఆర్‌సీబీ విజయంతో అర్థరాత్రి సమయంలో అభిమానులు బయటకు వచ్చి సంబురాలు జరుపుకున్నారు. అప్పటికే వారిని నియంత్రించే పనిలో పోలీసులు ఉన్నారు. ఆ తర్వాతి రోజే విజయోత్సవ వేడుకలు జరగటంతో పోలీసులకూ మరింత భారం పడింది. జూన్‌ 4న ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆర్‌సీబీ తన సోషల్‌ మీడియా ఖాతాలలో విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని పోస్ట్‌ చేసింది. విధానసౌధ (రాష్ట్ర సచివాలయం) నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నస్వామి స్టేడియం వరకూ పరేడ్‌ ఉంటుందని పేర్కొన్నది. అప్పటికీ అభిమానులు విజయోత్సవ పార్టీలలో.. పోలీసులువారి విధులలో ఉన్నారు.
పరేడ్‌ కోసం ఆర్‌సీబీ యాజమాన్యం ప్రయత్నాలు
ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆర్‌సీబీ బృందం అధికారులు కలవాల్సి ఉన్నది. అయితే, బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి దయానంద బహిరంగ బస్సు విజయోత్సవ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియంలోని వేడుకలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. విజయోత్సవ ర్యాలీ కోసం ఆర్‌సీబీ యాజమాన్యం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్‌ను కలిసినట్టు తెలిసింది. అయినా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీ ఉండదని మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ.. అప్పటికే వేలాది మంది బెంగళూరువాసులు, అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ గురించి మళ్లీ పోస్ట్‌ పెట్టింది.
రోడ్లపై బారులు తీరిన అభిమానులు
ఆర్‌సీబీ టీం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని వీఐపీలకు మాత్రమే సేవలందించే హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్నది. అక్కడి నుంచి బెంగళూరు నడిబొడ్డున ఉన్న రేస్‌కోర్స్‌ రోడ్‌లోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌ హోటల్‌కు ప్రయాణించింది. విజయోత్సవ ర్యాలీ రద్దు వార్త వ్యాపించటంతో విరాట్‌, రజత్‌ పాటిదార్‌, వారి జట్టును చూసేందుకు వేలాది మంది అభిమానులు రోడ్లపై బారులు తీరారు. బస్సులో వెళ్తున్న తమ అభిమాన క్రీడాకారులు సరిగ్గా కనిపించకపోయినప్పటికీ.. ఫ్యాన్స్‌ మాత్రం జట్టుపై పూలు విసరటం, నృత్యాలు చేయటం ఆపలేదు. ఆర్‌సీబీ జట్టు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి పరిస్థితి గందరగోళంగా ఉన్నదని పోలీసు వర్గాలు చెప్పాయి. ఆర్‌సీబీ జట్టు బస్సులో వెళ్తుండటం, అభిమానుల కోలాహలం అన్ని మాధ్యమాలలోనూ ప్రసారం కావటంతో.. లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియం వైపు కదిలారు.
ర్యాలీ ఉండదన్న ట్రాఫిక్‌ పోలీసులు.. లోపించిన సమన్వయం
వాస్తవానికి, ఈ విషయంలో బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులలో సమన్వయం లోపించింది. విధానసౌధ, చిన్నస్వామి స్టేడియాంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సన్మాన కార్యక్రమాలుంటాయనీ, ప్రజలు మెట్రో, ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ట్రాఫిక్‌ అడ్వైజరీని జారీ చేశారు. విజయోత్సవ ర్యాలీ ఉండదని కూడా అందులో పేర్కొనటం గమనార్హం. విధానసౌధలో జరిగిన సన్మాన కార్యక్రమం ఎలాంటి దుర్ఘటనా లేకుండా ముగిసినప్పటికీ.. చిన్నస్వామి స్టేడియంలో గందరగోళం, విషాదం ఒకేసారి బయటపడ్డాయి. తమకు, కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు, ప్రభుత్వ అధికారులకు మధ్య సమాచార లోపం ఉన్నదని పోలీసు వర్గాలు చెప్పాయి.
కొన్ని ప్రవేశద్వారాలను మాత్రమే తెరిచిన వైనం
ఇక 21 ప్రవేశ ద్వారాలున్న చిన్నస్వామి స్టేడియంలో.. ప్రజలు లోనికి రావటానికి కొన్నిటిని మాత్రమే తెరిచారు. ఇది ఒక అడ్డంకిని సృష్టించిందనీ, అన్ని గేట్లనూ ఎందుకు తెరవలేదని ఒక అధికారి అన్నారు. స్టేడియం లోపల విషాదం తప్పిందనీ, అక్కడ జనాల సంఖ్య స్టేడియం సామర్థ్యానికి మూడు, నాలుగు రెట్లు మించిపోయిందని మరొక అధికారి తెలిపారు. ‘మాకు సాయం చేయండి’ అని రాసి ఉన్న కాగితాలను పోలీసులపైకి కొందరు విసిరేయటంతో.. పరిస్థితి మరింత దిగజారుతోందని పోలీసులు గ్రహించారని వివరించారు. దీంతో కార్యక్రమం జరుగుతుండగానే ప్రజలను బయటకు పంపించిన పరిస్థితులు అక్కడ కనిపించాయి. చాలా మంది పాస్‌లతోనూ బయటే ఉండిపోయారు. పాస్‌లు లేని వారూ చాలా మంది బారికేడ్లను కదిలించి ప్రవేశానికి యత్నించారు. దీనితో తోపులాట చోటుచేసుకున్నది. ఇక ఏయే ప్రవేశ ద్వారాలు తెరిచారో అన్న విషయంపై స్పష్టత లేకపో వటం, అధికారుల నుంచి ప్రకటనలు రాకపోవటంతో ప్రజలలో గందరగోళం ఏర్పడింది. ఒక గేటు నుంచి మరో గేటుకు పరిగెత్తిన దృశ్యాలు కనిపించాయి. నిరాశ, ఆగ్రహంతో ఉన్న అభిమానులు గేట్లను తోయటం ప్రారంభించారు. లింక్‌ రోడ్‌లోని గేట్‌ నెంబర్‌ 7 అత్యంత ప్రాణాంతక ప్రదేశంగా మారింది. క్వీన్‌రోడ్‌ గేట్ల గుండా ప్రవేశించటంలో విఫలమైన జనసమూహం అక్కడకు వచ్చింది. ఈ గందరగోళం మధ్యే అనేక మంది తొక్కిసలాటకు గురయ్యారు. కొంత మంది అక్కడే మరణించగా.. కనీసం 50 మంది గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -