నవతెలంగాణ-హైదరాబాద్: భారత వైమానిక దళంలో మహిళలు రాఫెల్ యుద్ధ విమానాన్ని నడపగలిగినపుడు, వారిని ఆర్మీలోని జడ్జి అడ్వకేట్ జనరల్ (లీగల్) పోస్టుల్లో ఎందుకు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని నిలదీసింది. ఈ పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ పోస్టులకు 50-50 నిబంధన వర్తించినప్పటికీ మహిళలను ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది.
ఇద్దరు మహిళా అధికారులు అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగిలు దాఖలు చేసిన పిటిషన్పై మే 8న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఆ ఇద్దరు అధికారులు ఆర్మీలోని జడ్జి అడ్వకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో వరుసగా 4,5 ర్యాంకులు సాధించారు. పురుషుల కన్నా మెరిట్ ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళలకు కేటాయించిన ఖాళీలు తక్కువగా ఉండటం వలన జెఎజి విభాగానికి తమను ఎంపిక చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. మహిళలు మరియు పురుషులకు అసమానంగా ఉన్న ఖాళీలను ఈ పిటిషన్లో సవాలు చేశారు. మొత్త ఆరు పోస్టుల్లో మహిళలకు మూడు ఖాళీలు మాత్రమే ఉన్నందున వారిని ఎంపిక చేయలేమని అధికారులు చెప్పారని అన్నారు.
భారత వైమానిక దళంలో ఒక మహిళ రాఫెల్ యుద్ధ విమానం నడపడానికి అనుమతి ఉంటే, జెఎజిలో ఎక్కువ మంది మహిళలను అనుమతించడం ఆర్మీకి కష్టం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించింది. లింగబేధంతో సంబంధం లేకుండా తటస్థ పోస్టులైనప్పటికీ.. మహిళలకు ఎందుకు తక్కువ పోస్టులు కేటాయించారని ప్రశ్నించింది. పురుషులు-మహిళలు ఆధారంగా ఖాళీలను విభజిచడం వలన అధిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థులను తీసుకోనపుడు.. పోస్టులను లింగ తటస్థ పోస్టులను ఎందుకు పిలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 10మంది మహిళలు జెఎజికి అర్హత సాధిస్తే..వారందరినీ జెఎజి బ్రాంచ్ అధికారులుగా నియమిస్తారా అని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు.