నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను తన కను సైగతో శాసించిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించినా అది సాధ్యపడలేదు. దీంతో 2023 ఓటమితో తర్వాత ఆయన దాదాపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ తాజాగా తన బావ, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివదేహానికి నివాళి అర్పించారు. ఎర్రవల్లి నుంచి ఇవాళ ఉదయం హైదరాబాద్కు వచ్చిన కేసీఆర్ హరీశ్ రావును ఓదార్చి తన బావకు నివాళి అర్పించారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ లుక్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎప్పుడూ క్లీన్ షేవింగ్తో కనిపించే కేసీఆర్ ఇప్పడు కాస్త గడ్డంతో కనిపించారు. అలాగే గతంలో పోలిస్తే మరింత బలహీనంగా ఉన్నట్లు కనిపించారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తమ నాయకుడికి ఏమైంది అంటూ బీఆర్ఎస్లో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక 2023 డిసెంబర్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్కు యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఏడాది జూలైలో జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, సోడియం స్థాయి పడిపోవడంతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి నేరుగా నంది నగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు.



