– కొట్లాటలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
అమరావతి: సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంత వరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అమరావతిలోని సచివాలయంలో గురు వారం ఆయన మీడియాతో నీటి ప్రాజెక్టులపై మాట్లాడారు. గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయనీ, పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతి రాని ప్రాజెక్టులేనని అన్నారు. మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం? తెలంగాణపై ఎప్పుడైనా గొడవ పడ్డామా? అని అడిగారు. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదని, కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని తెలిపారు.
నేనేమీ అడ్డుచెప్పను
గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయనీ, ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయని ఏపీ సీఎం అన్నారు. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువగా ఉన్నా యని, కొత్త అథారిటీ ఎలా కేటాయిస్తే అలా తీసుకుం దామని తెలిపారు. దేవాదుల, కల్వకుర్తి తాను ప్రారం భించిన ప్రాజెక్టులేననీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ నిర్మించుకోమని చెప్తున్నానని, వాళ్లు ప్రాజెక్టు లు నిర్మించుకుంటే నేనేమీ అడ్డుచెప్పనని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఆంధ్ర రెండూ అభివృద్ధి చెందాలి
నేను హైదరాబాద్ను అభివృద్ధి చేయడం వల్లే జీఎస్డీపీలో ఇప్పుడు తెలంగాణ నంబర్వన్గా ఉందనీ, ఫలితంగా అందరూ సంతోషిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముందే చెప్పానని, సొంత ఓటు బ్యాంకుకు కొంత ఫేవర్ చేయాలని ఎవరైనా భావిస్తారని, తెలంగాణ మంచి ఎకో సిస్టమ్ ఉన్న రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ వంటి పరిస్థితులు ఏపీలో రావాలంటే సమయం పడుతుందని, ప్రజాహితం కోసమే నా పోరాటాలు ఉంటాయని, తెలంగాణ, ఆంధ్ర రెండూ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలిపారు. నల్లగొండ జిల్లాలో విపరీతమైన ఫ్లోరైడ్ సమస్య ఉండేదని, ఆ జిల్లా కోసం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును నేనే చేపట్టానని తెలిపారు. ఏఎంఆర్ విజయవంతం కాగానే దేవాదుల చేపట్టానని అన్నారు.
గోదావరి -బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదు
గోదావరిలో ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు నిర్మించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందామని అన్నారు. ఎవరూ ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదనీ, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, కేటాయింపుల చట్టబద్ధత కోసం కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని కోరారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదని, తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టుకుని బాగుపడాలని కోరుకుంటానని తెలిపారు. గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని కోరారు.