– పదవుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు
– మీకు ఇరిటేషన్ తప్ప..ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు : రేవంత్, ఉత్తమ్లపై మాజీ మంత్రి హరీశ్ ఫైర్
– కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలూ నోరు మెదపటం లేదని ఆవేదన
– ‘బనకచర్ల’పై పవర్ పాయింట్ ప్రజంటేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గతంలో కృష్ణా జలాలను దోపిడీ చేసినట్టుగానే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు రూపంలో గోదావరి జలాలను దోపిడీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఎందుకు మౌనం గా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ మీదా, బీఆర్ఎస్ నేతల మీదా అక్రమ కేసులు పెట్టటంలో సీఎం, మంత్రులు బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వారికి ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప.. ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదంటూ దుయ్యబ ట్టారు. తమ పదవుల కోసం తెలంగాణ ప్రయోజనా లను వారు తాకట్టు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బనకచర్లపై మేం మౌనంగా లేం, చట్టపరంగా ముందుకెళుతున్నాం…’ అంటూ మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో హరీశ్రావు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ‘బనకచర్ల’పై హరీశ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ అంశంపై కేవలం లేఖలు రాయటం, వాటిని మీడియాకు విడుదల చేయటం కాదు… బనకచర్లను అడ్డుకోవటంపై నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించాలంటూ డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ ప్రభుత్వం కృష్ణా నీళ్లను తీసుకుపోతుంటే మౌనంగా చూస్తూ ఎందుకుంటున్నారని ప్రశ్నించారు.
ఇదే విషయమై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు సైతం ఒక్క మాటా మాట్లాడటం లేదని విమర్శించా రు. నిధుల్లో, నదుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా మీకు పట్టదా? అని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో గతంలో చంద్రబాబు మహారాష్ట్రపై పెద్ద ఎత్తున పోరాటం చేశారని హరీశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే తరహాలో బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య మంత్రి రేవంత్ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుతో దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడతారా? అని సీఎంను అడిగారు. తెలంగాణ కంటే పదిశాతం నిధులను అదనంగా ఆంధ్రాకు ఇచ్చామంటూ కేంద్ర మంత్రి బండి సంజరు ప్రకటించారని గుర్తు చేశారు. మరోవైపు నదుల అనుసంధానం పేరిట ఏపీ సర్కారు తన పరపరితో కేంద్రం నుండి నిధులను తెచ్చుకుంటోందని పేర్కొన్నారు. అయినా సీఎం రేవంత్లో కదలికలేదని వాపోయారు. ఇప్పటికైనా కండ్లు తెరవండి, తెలంగాణకు నష్టం జరక్కముందే బనకచర్లను అడ్డుకోండని సీఎంకు, మంత్రులకు హితవు పలికారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పోరాటం నిర్వహించతలపెట్టినా.. బీఆర్ఎస్ తరపున పూర్తి మద్దతునిస్తామని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానించినా సహకరిస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ సర్కారు ముందుకు రాకపోతే.. తమ పార్టీయే న్యాయ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
బనకచర్లపై ఎందుకింత మౌనం..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES